Vaishno Devi stampede | వైష్ణో దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి భక్తుల వద్ద ఎలాంటి సమాచారమున్నా వెంటనే త్రిసభ్య కమిటీకి అందజేయాలని కమిటీ సభ్యుడు రాఘవ్ లాంగర్ విజ్ఞప్తి చేశారు. తొక్కిసలాటకు సంబంధించిన నిజా నిజాలు, సమాచారం, మరే ఇతర ఆధారాలు గానీ ఉంటే వెంటనే కమిటీ దృష్టికి తీసుకురావాలని కోరారు. జనవరి 5 న కమిషన్ కి వాటిని సమర్పించాలని రాఘవ్ లాంగర్ పిలుపునిచ్చారు.
జమ్మూ కశ్మీర్లోని మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని అర్ధరాత్రి 2 గంటలకు భక్తులు అధిక సంఖ్యలో దర్శనాలకు వచ్చారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, 16 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే ఇద్దరు యువకుల మధ్య మొదలైన వాగ్వాదం క్షణాల్లోనే తొక్కిసలాటకు కారణమైందని ప్రాథమికంగా ఓ నిర్ధరణకు వచ్చినట్లు సమాచారం. అయితే ఈ తొక్కిసలాటపై అక్కడి ప్రభుత్వం ఓ ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఇందులో ముగ్గురు సభ్యులుంటారు. ఓ వారంలోగానే ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.