Lalu Prasad Yadav | పాట్నా : రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు లాలు ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాజాగా నోటీసులు జారీ చేసింది. రైల్వే ల్యాండ్ ఫర్ జాబ్స్ మనీలాండరింగ్ కేసులో తండ్రీకుమారులకు ఈడీ నోటీసులు ఇచ్చినట్లు పేర్కొంది. వీరిద్దరిని పాట్నా ఆఫీసులో విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. జనవరి 29న లాలూను, 30వ తేదీన తేజస్విని హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నోటీసులను లాలూ అధికారిక నివాసం వద్ద ఆయన భార్య రబ్రీ దేవికి ఈడీ అధికారులు అందజేశారు.
2004 నుంచి 2009 వరకు యూపీఏ ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో నిబంధనలు ఉల్లంఘించి, ఎలాంటి ప్రకటనలు, పబ్లిక్ నోటీసు లేకుండా అనుకూలమైన వారిని రైల్వేలో నియమించారని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. ముంబై, జబల్పూర్, కోల్కతా, జైపూర్లోని వివిధ రైల్వే జోన్స్లో కొంత మంది పాట్నా నివాసితులకు ఉద్యోగాలు ఇచ్చారని పేర్కొన్నాయి. క్విడ్ ప్రోకో కింద ఆ అభ్యర్థులు లాలూ కుటుంబానికి చాలా తక్కువ ధరలకు భూమిని అమ్మినట్లు అభియోగాలు మోపాయి.