న్యూఢిల్లీ/భోపాల్, మే 27: మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలో 13 ప్రాంతాల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) శనివారం ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఈ సోదాల సందర్భంగా ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)తో సంబంధాలు ఉన్న 10 మందిని అరెస్టు చేసినట్టు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని విమర్శలు చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. వారి పార్టీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్లో ఉగ్ర లింకులపై ఏం సమాధానం చెబుతారనే ప్రశ్నలు వస్తున్నాయి.
దాడుల సమయంలో ఆయుధాలు, డిజిటల్ పరికరాలు, కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకొన్నామని అధికారులు తెలిపారు. ఎన్ఐఏ అధికారులు, మధ్యప్రదేశ్ పోలీస్ యాంటీ టెర్రర్ స్కాడ్(ఏటీఎస్) ఆధ్వర్యంలో ఈ సంయుక్త ఆపరేషన్ జరిగింది. వీరంతా ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధులు సేకరిస్తున్నారని, యువతను రిక్రూట్ చేసుకొంటూ పలు విధాలుగా ఐసిస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారని దర్యాప్తులో తెలిందని అధికారులు పేర్కొన్నారు.