ముంబై, జూలై 31: షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన ఓ ఎమ్మెల్యే రాజ్యసభ సభ్యురాలిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందంగా ఉన్నందుకే ప్రియాంక చతుర్వేదిని రాజ్యసభకు పంపించారని.. అందమే ఆమె అర్హత అని ఎమ్మెల్యే సంజయ్ శిర్షత్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ‘షిండే వర్గాన్ని ద్రోహులని విమర్శించే అర్హత ప్రియాంక చతుర్వేదికి లేదు. కాంగ్రెస్ను మోసం చేసి ఆమె శివసేన (యూబీటీ)లో చేరా రు. అందంగా ఉన్నందుకే ఆదిత్య ఠాక్రే ఆమెను రాజ్యసభకు పంపించారు’ అని సంజయ్ శిర్షత్ వ్యాఖ్యానించారు. తను ఎలా ఉన్నానో.. ఎక్కడ ఉన్నానో.. ద్రోహులు చెబితే తెలుసుకోవాల్సిన అవసరం తనకు లేదని ప్రియాంక చతుర్వేది మండిపడ్డారు. కుళ్లిన మనసులు ఉన్నవారు రాజకీయాల్లో ఎలా రాణిస్తున్నారో అర్థం కావడం లేదని ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే అన్నారు.