న్యూఢిల్లీ: ఇక ప్రైవేట్ సంస్థలు కూడా అంతరిక్షంలోకి ఉపగ్రహాలను తయారు చేసి ప్రయోగించవచ్చు. లాంచింగ్ సైట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. భారత భూభాగంలో గానీ, విదేశాల్లో గానీ ప్రయోగించేందుకు అనుమతినిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆయా సంస్థలు సొంతంగా గానీ, లీజ్డ్ లాంచ్ సైట్ మీద ప్రయోగించుకోవచ్చు.
కేంద్ర అంతరిక్ష మంత్రిత్వ శాఖ (డీవోఎస్) ఆధీనంలోని ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్-స్పేస్) అనే స్వతంత్ర సంస్థ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
మొబైల్ ప్లాట్పామ్స్పై (భూభాగంపై నుంచి, సముద్ర మార్గం లేదా వాయు మార్గం) నుంచి కూడా ఉపగ్రహాలను ప్రయోగించొచ్చు. ఈ మేరకు నేషనల్ స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ పాలసీ-2020 ముసాయిదాను అంతరిక్ష మంత్రిత్వశాఖ (డీవోఎస్) రూపొందించింది.
దీని ప్రకారం ఉపగ్రహ ప్రయోగం, లాంచ్పాడ్స్, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని డీవోఎస్ ఈ ముసాయిదా తయారు చేసిందని అగ్నికుల్ కాస్మోస్ సీఈవో కం కో ఫౌండర్ శ్రీనాథ్ రవి చంద్రన్ తెలిపారు. ఈ సంస్థ చిన్న ఉపగ్రహాలను ప్రయోగించడానికి స్మాల్ రాకెట్లు (ఉపగ్రహ వాహన నౌక) తయారు చేస్తున్నది.
అగ్నికూల్ కాస్మోస్తోపాటు స్కై రూట్ ఏరోస్పేస్ కూడా చిన్న ఉపగ్రహ తయారీ సంస్థ. అయితే, ప్రైవేట్ ఉపగ్రహ ప్రయోగానికి ఇన్-స్పేస్ ఆమోదం తప్పనిసరి. అందుకు ఉపగ్రహ ప్రయోగ సంస్థ నుంచి ఫైనాన్సియల్ గ్యారంటీ లేదా ఇన్సూరెన్స్ కవర్ అవసరం.