న్యూఢిల్లీ, ఆగస్టు 19: సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన పలు తీర్పులు భారత్లో పౌరహక్కులకు ప్రమాదం కలిగించేలా ఉన్నాయని అంతర్జాతీయ ప్రముఖులు ఆందోళన వ్యక్తంచేశారు. వీటిని సమీక్షించాలని అభ్యర్థించారు. గుజరాత్లో 2002లో జరిగిన అల్లర్ల కేసుల్లో నాటి సీఎం, నేటి భారత ప్రధాని నరేంద్రమోదీతోపాటు గుజరాత్ ప్రభుత్వానికి సిట్ క్లీన్ చిట్ ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ జకియా జాఫ్రీ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రముఖుల సంతకాలతో శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ ప్రకటనపై బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు బికూ పరేఖ్, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ నోమ్చోమ్స్కీ, మాక్స్ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ అర్జున్ అప్పాదురై తదితరులు సంతకాలు చేశారు. గుజరాత్ అల్లర్లలో హత్యకు గురైన ఎంపీ ఎహసాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే.
ఆ తీర్పు తర్వాత పిటిషన్ దారుల్లో ఒకరైన సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్తోపాటు ఈ కేసులో సాక్షిగా ఉన్న ఆర్బీ శ్రీకుమార్ను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. వారికి కోర్టు బెయిల్ కూడా ఇవ్వలేదు. ఈ జాఫ్రీ పిటిషన్ను విచారించిన తీరుపై తాజా ప్రకటనలో మూడు అభ్యంతరాలను లేవనెత్తారు. సిట్ దర్యాప్తులో తేల్చిన అంశాలపై అభ్యంతరాలు లేవనెత్తుతూ స్వతంత్ర దర్యాప్తు కోరితే, అదే సిట్ రిపోర్టులోని అంశాల ఆధారంగా పిటిషన్ను కొట్టేయడం వింతగా ఉన్నదని పేర్కొన్నారు.