న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 29న ఇటలీ, యూకే దేశాల పర్యటనకు బయలుదేరనున్నారు. ఆ రెండు దేశాల్లో ఈ నెల 29 నుంచి నవంబర్ 2 వరకు ఆయన పర్యటన కొనసానుంది. ఇటలీలోని రోమ్ నగరంలో, యునైటెడ్ కింగ్డమ్లోని గ్లాస్గో నగరంలో జరిగే రెండు కీలక సదస్సుల్లో ఆయన పాల్గొననున్నారు. వాటిలో ఒకటి జీ-20 సదస్సు. ఈ ఏడాది జరుగబోయేది 16వ జీ-20 సదస్సు. ఇక రెండోది వరల్డ్ లీడర్స్ అంతా పాల్గొనే కాప్ సదస్సు. ఇది 26వ కాప్ సదస్సు. వరల్డ్ లీడర్స్ సమ్మిట్ ఆఫ్ కాప్-26గా ఈ సదస్సును పిలుస్తున్నారు. ఈ వివరాలను భారత విదేశాంగ శాఖ ఇవాళ మీడియాకు వెల్లడించింది.
ఈ పర్యటనలో ప్రధాని పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇటలీ ప్రధాని మరియో డ్రాగీతో కూడా ప్రధాని సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. అదేవిధంగా గ్లాస్గోలో జరిగే కాప్-26 సదస్సు సందర్భంగా యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ సహా ఇతర దేశాల అధినేలతో ప్రధాని భేటీ కానున్నారు.