న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ రేపు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. దేశంలో కరోనా పరిస్థితిపై రేపు (డిసెంబర్ 23న) ప్రధాని ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కరోనా పరిస్థితి, ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతి, వైరస్ కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నది.
కాగా, కేంద్రం ఇప్పటికే ఒమిక్రాన్ కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూలు విధించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ కేసులు 213కు చేరాయి. మహారాష్ట్ర, ఢిల్లీల్లో అత్యధికంగా ఒమిక్రాన్ కేసులు వెల్లడయ్యాయి. తెలంగాణలో కూడా 24 మంది ఒమిక్రాన్ బారినపడ్డారు. మొత్తం కేసులలో ఇప్పటికే 90 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 113 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఓవరాల్గా కూడా ప్రస్తుతం దేశంలో 78,190 యాక్టివ్ కేసులు ఉన్నాయి.