న్యూఢిల్లీ: దేశంలో కరోనా థర్డ్వేవ్ శరవేగంగా విజృంభిస్తున్నది. వారం రోజుల క్రితం 10 వేలకు లోపే ఉన్న రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పుడు 1.50 లక్షలు దాటింది. దాంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై కొవిడ్ నిబంధనలను కఠినతరం చేశాయి. వీకెండ్ లాక్డౌన్లు, నైట్ కర్ఫ్యూల వంటి కట్టడి చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు.
ఈ సాయంత్రం 4.30 గంటలకు సమావేశం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కేంద్రంలోని ఉన్నతాధికారులు, ఆరోగ్య శాఖ అధికారులు, ఆరోగ్య నిపుణులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు సమాచారం. కాగా, ఇవాళ కొత్తగా దేశవ్యాప్తంగా 1,59,632 మంది కోరోనా బారినపడ్డారు. నిన్నటి కేసులతో పోల్చుకుంటే ఇవాళ 11 శాతం పాజిటివ్ కేసులు అధికంగా వచ్చాయి. అదేవిధంగా యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 5,90,611కు చేరింది.
ఇదిలావుంటే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా దేశంలో వేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటివరకు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3,623కు చేరింది. మొత్తం దేశంలోని 27 రాష్ట్రాల్లో ఈ కొత్త వేరియంట్ కాలుమోపింది. మహారాష్ట్రలో అత్యధికంగా 1,009 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. ఆ తర్వాత 513 ఒమిక్రాన్ కేసులతో ఢిల్లీ రెండో స్థానంలో ఉన్నది. ఇక ఇవాళ కొత్తగా 327 మంది కొవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో దేశంలో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 4,83,790 పెరిగింది.