PM Modi | న్యూఢిల్లీ, జూన్ 18: అసలు నిజాలను దాచేసి అందమైన అబద్ధాలను గొప్పగా ఎలా చెప్పుకోవచ్చో మరోసారి నిరూపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇటీవల రోజ్గార్ మేళా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన వర్చువల్గా మాట్లాడారు. తన పాలన గురించి గొప్పగా చెప్పుకున్నారు. అయితే, ఆయన మాటలకు, జరుగుతున్న దానికి మాత్రం పొంతన కుదరడం లేదు. గత ప్రభుత్వాలు ఎన్నడూ ఇవ్వనన్ని ఉద్యోగాలు తమ సర్కార్ ఇస్తున్నదని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు పెరిగాయని మోదీ గొప్పలు చెప్పుకున్నారు. అయితే, ఈ మాటలు ఎంత నిజమో దేశంలో నానాటికీ నిరుద్యోగ రేటు చూస్తే అర్థమవుతుంది. మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మూడేండ్లలోనే 2017 నాటికి దేశంలో నిరుద్యోగ రేటు 6.1 శాతానికి ఎగబాకింది. 45 ఏండ్లలో ఇదే గరిష్ఠం. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి దేశంలో నిరుద్యోగం మరింత పెరిగి 8.11 శాతానికి చేరినట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) వెల్లడించింది. దేశంలో నిరుద్యోగ సంక్షోభం ఉన్నదని, ప్రతియేటా చదువులు పూర్తి చేసుకొని జాబ్ మార్కెట్లోకి అడుగుపెడుతున్న యువతకు సరిపడా ఉద్యోగ అవకాశాలు లభించడం లేదని వివిధ సంస్థలు చెబుతున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియకు పట్టే కాలం గురించి కూడా మోదీ చెప్పిన మాటలకు, అసలు పరిస్థితులకు పొంతన లేదు. నియామక ప్రక్రియకు ఏడాది, అంతకంటే ఎక్కువ సమయం పట్టేదని, కోర్టులు జోక్యం చేసుకుంటే ఐదేండ్ల కంటే ఎక్కువ సమయమూ పట్టేదని మోదీ చెప్పుకొచ్చారు. ఇప్పుడు మాత్రం కొన్ని నెలల్లోనే పూర్తి పారదర్శకతతో నియామక ప్రక్రియ పూర్తి చేసినట్టు చెప్పుకున్నారు. అయితే, అసలు పరిస్థితి ఏంటని చెప్పడానికి 2018 నాటి కేంద్ర పోలీసు బలగాల్లో కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ సరైన ఉదాహరణ. ఎస్ఎస్సీ ద్వారా 2018లో ఈ ఉద్యోగాలకు నియమితులైన వారికి 2022 చివరి నాటికి కూడా నియామక పత్రాలు అందలేదు. అంతర్జాతీయ సంస్థలు హైవేల నిర్మాణం, రైల్వేలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ వంటి అంశాల్లో గత ప్రభుత్వాల పాలనలో కంటే ప్రస్తుతం భారత్ మెరుగ్గా ఉన్నట్టు మోదీ చెప్పుకున్నారు. అయితే, ఇలా చెప్పిన సంస్థల పేర్లు ఏంటనేది మాత్రం ఆయన చెప్పకపోవడం గమనార్హం.
ఉద్యోగాల విధ్వంసకారి అయిన బీజేపీ గుర్తింపు కోసం చేసిన తమాషానే రోజ్గార్ మేళా అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శించారు. వార్తల హెడ్లైన్లలో నిలవడానికే ఈ కార్యక్రమం చేపట్టారని పేర్కొన్నారు. రోజ్గార్ మేళా ద్వారా ఇస్తున్నవి కొత్త ఉద్యోగాలు కాదని ఆయన గుర్తు చేశారు. తన తొమ్మిదేండ్ల పరిపాలనలో ఉద్యోగాలు సృష్టించడంలో విఫలమైన ప్రధాని మోదీ ఇప్పుడు యువతకు ఏదో మేలు చేస్తున్నట్టుగా ఈ కార్యక్రమం చేసినట్టు విమర్శించారు.