శివమొగ్గ ఘటనపై ప్రధాని సంతాపం

బెంగళూరు : కర్ణాటక శివమొగ్గ పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేలుడులో మృతి చెందిన వారికి సంతాపం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తుందని పీఎంఓ ట్వీట్ చేసింది. ఇదిలా ఉండగా.. శివమొగ్గలో గురువారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. అబ్బలగిరె గ్రామ సమీపంలో డైనమైట్ పేలిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. క్వారీకి ఉపయోగించే పేలుడు పదార్థాలను తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో వాహనం పూర్తిగా దెబ్బతింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప హాస్పిటల్కు తరలించారు. పేలుడు ధాటికి శివమొగ్గ జిల్లాతో పాటు చిక్మంగళూరు జిల్లాలోనూ ప్రకంపనలు వచ్చాయి. భారీ శబ్దంతో ప్రకంపనలు రావడంతో పలు భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. పలుచోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి.