PM Modi | బెంగళూరు, ఆగస్టు 26: ఇస్రో శాస్త్రవేత్తల కార్యక్రమానికి కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలను రావొద్దని ప్రధాని మోదీ ఆదేశించటం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నది. ఇస్రో శాస్త్రవేత్తల దశాబ్దాల శ్రమను పక్కకునెట్టి.. క్రెడిట్ కొట్టేసేందుకు ప్రధాని మోదీ, బీజేపీ తహతహలాడుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. నాలుగు రోజుల విదేశీ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ, శనివారం బెంగళూరులోని ఇస్రో ప్రధాన కేంద్రానికి చేరుకున్నారు. సైంటిస్టులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. కర్నాటక సీఎం, డిప్యూటీ సీఎంలను కార్యక్రమానికి రాకుండా అడ్డుకున్నారని, ప్రొటోకాల్కు విరుద్ధంగా వ్యవహరించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
‘2008లో చంద్రయాన్-1 సక్సెస్ కాగానే ఆనాటి ప్రధాని మన్మోహన్సింగ్ కన్నా ముందుగా అప్పటి గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్రమోదీ.. అహ్మదాబాద్లోని ఇస్రో సెంటర్కు వెళ్లిన సంగతి మరిచిపోయినట్టు ఉన్నారు’ అని కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేశ్ ట్వీట్ చేశారు. ఇస్రోలో సైంటిస్టుల కార్యక్రమాన్ని సైతం రాజకీయంగా వాడుకున్నారని ప్రధాని మోదీపై జేడీయూ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు ఆరోపణలు చేశాయి. బీజేపీ 2024 ఎన్నికల ప్రచార అంశంగా ఇస్రో మారిందని తృణమూల్ నాయకురాలు మహువా మోయిత్రా అన్నారు. కొన్ని దశాబ్దాల సైంటిస్టుల పరిశోధనను ‘మోదీ మ్యాజిక్’గా బీజేపీ ప్రచారం చేసుకుంటున్నదని విమర్శించారు.
ఆగస్టు 23 ‘జాతీయ అంతరిక్ష దినోత్సవం’
ఇస్రోపై ప్రధాని మోదీ పొగడ్తల వర్షం కురిపించారు. ఆగస్టు 23ను ‘జాతీయ అంతరిక్ష దినోతవ్సం’గా జరుపుకోవాలని మోదీ పిలుపి నిచ్చారు. చంద్రుడిపై ల్యాండర్ విక్రమ్ కాలుమోపిన చోటును ‘శివశక్తి పాయింట్’గా, చంద్రయాన్-2 కుప్పకూలిన ప్రదేశాన్ని ‘తిరంగా పాయింట్’గా పిలవాలని అన్నారు.