న్యూఢిల్లీ: చండీగఢ్ యూనివర్సిటీ వ్యవస్థాపక చాన్సలర్ సత్నామ్సింగ్ సంధూ మంగళవారం రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆయనను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసినట్టు కేంద్ర హోం శాఖ తెలిపింది. ఓ రైతు ఇంట జన్మించిన సంధూ చదువు కోసం ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని దేశంలోని ప్రముఖ విద్యావేత్తగా ఎదిగినట్టు పేర్కొంది. మొహాలీలోని లాండ్రన్లో 2001లో చండీగఢ్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ను, 2012లో చండీగఢ్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారని వివరించింది. ప్రజల ఆకాంక్షలు వినిపించే అవకాశం కల్పించారంటూ ప్రధాని మోదీకి సంధూ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.