Ramnath Kovind : 73 వ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ప్రజలందరికీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయులందర్నీ ఏకతాటిపైకి తెచ్చే పర్వంగా గణతంత్ర దినోత్సవాన్ని అభివర్ణించారు. స్వాతంత్ర్య సమర యోధులను స్మరించుకుంటూ, స్వరాజ్యం కలలను సాకారం చేసేందుకు పోరాడిన యోధులను స్మరించుకోవడం కూడా గణతంత్ర ఉత్సవాల్లో భాగమేనని ఆయన అన్నారు. 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి సారి కూడా ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలా, ఐక్యతా స్ఫూర్తిని చాటేలా గణతంత్ర దినోత్సవాలను జరుపుకుంటామని ఆయన గుర్తు తెచ్చుకున్నారు.
ఈసారి ఆర్భాటం తక్కువగా ఉంటుందని, అయితే స్ఫూర్తి మాత్రం ఎప్పటిలాగే వుంటుందని రాష్ట్రపతి వివరించారు. రెండు రోజుల కిందటే నేతాజీ 125 వ జయంత్యుత్సవాలను జరుపుకున్నామని, దేశ స్వాతంత్య్రం కోసం ఆయన తపన, ఆయన చేసిన పోరాటం జాతికే స్ఫూర్తినిచ్చిందని కోవింద్ కొనియాడారు. ప్రజాస్వామ్యం, న్యాయం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం గురించి రాజ్యాంగ పీఠిక వివరిస్తుందని, ఈ అంశాలన్నీ గణతంత్ర దినోత్సవ మూలాలను మరింత పటిష్ఠం చేస్తాయని ఆయన అన్నారు. మన దేశంలోని వైవిధ్యత, చైతన్య స్థాయిని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని రాష్ట్రపతి పేర్కొన్నారు.
కరోనాపై మానవాళి పోరాడుతూనే వుందని, ఇంతలా ఒకరినొకరు సహాయ సహకారాలు ఇచ్చుకున్నంత ఎన్నడూ ఇచ్చిపుచ్చుకోలేదన్నారు. కరోనా యావత్ ప్రపంచాన్ని ఘోరంగా దెబ్బ తీసిందని, చాలా మంది ప్రాణాలు కోల్పోయారని రాష్ట్రపతి రాంనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా సమాజం పోరాట దశలోనే వుందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, ప్రపంచం ప్రపంచమే ఓ తీవ్రమైన విపత్తును ఎదుర్కొంటోందన్నారు.
కరోనాపై దేశ ప్రజలు అపూర్వంగా పోరాటం సలుపుతున్నారని, ఇప్పటికీ కరోనా వుందని, ప్రజలందరూ అప్రమత్తులై ఉండాలని రాంనాథ్ కోరారు. ఇప్పటి వరకూ తీసుకున్న జాగ్రత్తలను ఇకపై కూడా తీసుకుంటూ వుండాలని, జాగ్రత్తల విషయంలో ఏమాత్రం అలసత్వం కూడదన్నారు. కరోనా కారణంగా ప్రజలందరూ ఓ కుటుంబంలా ముందుకు సాగారని, అందుకే ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడుతోందని పేర్కొన్నారు. ఇంత ప్రతికూల పరిస్థితులో కూడా ఆర్థిక వ్యవస్థ సవ్యంగా ఉందంటే, అది భారతీయుల పట్టుదలకు తార్కాణమని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మెచ్చుకున్నారు.