గదగ్, నవంబర్ 29: దేశంలో రైతులు ఎంతటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నారో చెప్పే వార్త ఇది. కర్ణాటకలో ఓ రైతు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను మంచి ధర వస్తుందన్న ఆశతో 415 కిలోమీటర్లు తీసుకెళ్లి అమ్మితే, అన్ని ఖర్చులూ పోను మిగిలింది అక్షరాలా రూ.8.36. ఉత్తర కర్ణాటకలోని తిమ్మాపూర్ అనే గ్రామానికి చెందిన రైతు పవడెప్ప హళ్లికెరి ఈ సీజన్లో ఉల్లి పండించారు. వర్షాలు సరిగా పడకపోవటంతో ఉల్లిగడ్డ పెద్దగా ఊరలేదు. పంట తీసిన తర్వాత 205 కిలోల ఉల్లిని మంచి ధర వస్తుందని నమ్మి బెంగళూరులోని యశ్వంత్పూర్ మార్కెట్కు తీసుకొచ్చాడు. ఆయన స్వగ్రామం నుంచి బెంగళూరు 415 కిలోమీటర్లు. తీరా మార్కెట్కు తీసుకొచ్చిన తర్వాత హోల్సేల్ వ్యాపారులు క్వింటాల్కు రూ.200 కంటే ఎక్కువ ఇవ్వబోమని తెగేసి చెప్పటంతో విధిలేక ఆ రేటుకే అమ్మేశాడు. మొత్తం సరుకు అమ్మితే వచ్చింది రూ.410. అందులో పోర్టర్ చార్జీ అని 24 తీసేసుకొన్నారు. సరుకు బెంగళూరు తీసుకొచ్చేందుకు ప్రయాణ చార్జీ రూ.377.64 పోయింది. చివరకు రైతుకు మిగిలింది రూ.8.36. ఈ మొత్తానికి వ్యాపారులు చిట్టీ బిల్లు కూడా రాసిచ్చారు. దానిని రైతు సోషల్మీడియాలో పోస్ట్ చేసి.. రైతులు ఎవరూ యశ్వంత్పూర్ మార్కెట్కు ఉల్లిని తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. ‘ఈసారి మా దగ్గర వర్షాలు సరిగా పడలేదు. ఉల్లి గడ్డలు పెద్దగా ఊరలేదు. దీంతో వ్యాపారులు మా పంటకు చాలా తక్కువ రేటు నిర్ణయిస్తున్నారు. తమిళనాడు, మహారాష్ట్ర నుంచి వచ్చే సరుకు బాగుండటంతో వారికి మంచి రేటు ఇస్తున్నారు. నేను పంట పండించటానికి రూ.25,000 పెట్టుబడి అయ్యింది’ అని పవడెప్ప వాపోయాడు.
ఎమ్మెస్పీ కోసం ఉద్యమం
పవడెప్ప పోస్టు వైరల్గా మారటంతో రైతు సంఘాలు కర్ణాటక ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. కర్ణాటక ఉల్లి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) వెంట నే నిర్ణయించాలని కర్ణాటక రాజ్య రైతు సంఘానికి చెందిన గదగ్ జిల్లా అధ్యక్షుడు యెల్లప్ప బదరి డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే డిసెంబర్ మొదటి వారం నుంచి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.