భోపాల్ : మధ్యప్రదేశ్లో బీజేపీ సర్కార్ సామూహిక ప్రభుత్వ వివాహ వేడుకను నిర్వహించిన తీరు వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ వివాహ పథకంలో లబ్ధిదారులను ఎంపిక చేయటం కోసం పెండ్లి కూతుళ్లకు గర్భధారణ, కన్యత్వ పరీక్షలు నిర్వహించటమేమిటి? అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, సామాజిక సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.‘ముఖ్యమంత్రి కన్య వివాహ్ యోజన’ పథకం కింద గత శనివారం గడాసారాయి జిల్లాలోని 224 జంటలకు ప్రభుత్వ ఆధ్వర్యంలో సామూహిక వివాహ వేడుకను నిర్వహించారు.
పెండ్లి కూతురుకు వైద్య పరీక్షలు నిర్వహించాకే, లబ్ధిదారులుగా ఎంపిక చేసినట్టు స్థానిక జిల్లా అధికారులు పేర్కొన్నారు. ఐదుగురు గర్భంతో ఉన్నారన్నది వైద్య పరీక్షల్లో తేలటంతో, వివాహ పథకం నుంచి వారి పేర్లను తొలగించారు. దీంతో వైద్య పరీక్షలు నిర్వహించిన సంగతి బయటకు పొక్కింది. తాజా ఉదంతంపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని బీజేపీ సర్కార్ను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్నాథ్ డిమాండ్ చేశారు.