Over weight | న్యూఢిల్లీ, అక్టోబర్ 20: ప్రెగ్నెన్సీ సమయంలో విపరీతంగా బరువు పెరిగితే.. తదనంతర కాలంలో ఆ మహిళ మధుమేహం, గుండెజబ్బులతో మరణించే ప్రమాదం ఎక్కువని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. పెన్సిల్వేనియా వర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. లాన్సెట్ జర్నల్లో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనం ప్రకారం, అమెరికాలో 45 వేల మంది మహిళలకు సంబంధించిన 50 ఏండ్ల డాటాను సైంటిస్టులు విశ్లేషించారు.
ప్రెగ్నెన్సీ సమయంలో అనూహ్యంగా అధిక బరువు పెరిగినవారికి తదనంతర కాలంలో గుండెపోటు, మధుమేహం తలెత్తుతున్నట్టు వారు గుర్తించారు. అమెరికా సీడీసీ మార్గదర్శకాల ప్రకారం.. తక్కువ బరువున్న మహిళ ప్రెగ్నెన్సీ సమయంలో 12.5 నుంచి 18 కిలోల వరకు, ఊబకాయంతో ఉంటే 5 నుంచి 10 కిలోల వరకు బరువు పెరగవచ్చు. బరువు అదుపులో ఉంటే తల్లికి, నవజాత శిశువుకు ఇద్దరికీ మేలని పరిశోధకులు తెలిపారు.