Prayag Manjhi : తన తలపై కోటి రూపాయల రివార్డ్ ఉన్న మావోయిస్టు టాప్ లీడర్ ఎన్కౌంటర్లో మరణించాడు. జార్ఖంఢ్ (Jharkhand) లోని బొకారో జిల్లా లాల్పానియా ప్రాంతంలోని లుగు పర్వత పాదాల వద్ద తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో ఆయన మృతిచెందాడు. అతనిపై జాతీయ దర్యాప్తు సంస్థ ఇప్పటికే రూ.కోటి రివార్డ్ ప్రకటించింది. అతడే మావోయిస్టు టాప్ లీడర్ ప్రయాగ్ మాంఝీ. ఆయనకు వివేక్, ఫుచన, నాగ మాంఝీ, కరన్, లెతర అని మారు పేర్లు ఉన్నాయి.
తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో మొత్తం ఎనిమిది మంది మావోయిస్టులు మరణించారు. వారిలో అరవింద్ మాంఝీ, రామ్ మాంఝీ అనే మావోయిస్టులు కూడా ఉన్నారు. ఆ ఇద్దరిపై కూడా రూ.10 లక్షల చొప్పున రివార్డులు ఉన్నాయి. ఈ ఎన్కౌంటర్ సోమవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో చోటుచేసుకున్నట్లు స్థానిక పత్రికలు తెలిపాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేంద్ర కమిటీ సభ్యుడైన ప్రయాగ్ మాంఝీ ముఖ్యంగా ప్రశాంత్ హిల్స్ కేంద్రంగా తన కార్యకలాపాలను నిర్వహించేవాడు.
ధనాబాద్ జిల్లా తుండీ పోలీస్స్టేషన్ పరిధిలోని దల్బుధ మాంఝీ స్వగ్రామం. జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశాలో దాదాపు 100 దాడుల్లో అతడి హస్తం ఉంది. ఒక్క గిరిధి జిల్లాలోనే ఆయనపై 50 కేసులు ఉన్నాయి. తలపై రూ.కోటి రివార్డ్ ఉంది. జార్ఖంఢ్లో అత్యధిక రివార్డ్ ఉన్న రెండో మావోయిస్టు ఇతడే. మాంఝీ కాకుండా మరో నలుగురి పైనే రూ.కోటి రివార్డులు ఉన్నాయి. ఇతడు పరస్నాథ్ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు సమాచారం అందడంతో పోలీసులు వేగులను అప్రమత్తం చేశారు. కొన్నాళ్ల క్రితం అతడిని గుర్తించారు.
సోమవారం తెల్లవారుజామున సీఆర్పీఎఫ్, రాష్ట్ర పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. వీరికి లుగు హిల్స్ వద్ద మావోయిస్టులు ఎదురుపడటంతో ఎన్కౌంటర్ జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటికి మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు. అనంతరం భద్రతా బలగాలు ఘటన ప్రాంతంలో పరిశీలించగా మొత్తం 8 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆ ఎనిమిది మందిలో ప్రయాగ్ కూడా ఉన్నట్లు గుర్తించారు.
ఆపరేషన్ అనంతరం మావోయిస్టుల నుంచి ఎస్ఎల్ఆర్, ఎన్సాస్ లాంటి భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకొన్నారు. 209 కోబ్లా బెటాలియన్, జార్ఖండ్ పోలీసులు దీనిలో పాల్గొన్నారు. ఈ ఏడాది జార్ఖండ్లో జరిగిన ఎన్కౌంటర్లలో మొత్తం 13 మంది మావోలు ప్రాణాలు కోల్పోయారు. 2025 చివరికి రాష్ట్రాన్ని మావో రహిత రాష్ర్టంగా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా 244 మంది మావోయిస్టులను రాష్ట్రంలో అరెస్టు చేశారు. పలు దళాల కమాండర్లతో కలిపి 24 మంది లొంగిపోయారు.
కాగా ప్రయాగ్ మాంఝీ భార్య జయా మాంఝీని గత ఏడాది పోలీసులు అరెస్టు చేశారు. ఆమె క్యాన్సర్తో బాధపడుతోంది. చికిత్స తీసుకోవడానికి వచ్చిన సమయంలో అప్పుడు ఆమెను అరెస్టు చేశారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ ఆమె మరణించారు.