DK Shiva Kumar | కర్ణాటక డీజీపీగా కొనసాగుతున్న ప్రవీణ్ సూద్ సీబీఐ డైరెక్టర్గా నియామకమైన విషయం తెలిసిందే. అయితే ప్రవీణ్ సూద్ను సీబీఐ డైరెక్టర్గా నియమించడం వెనుకాల పెద్ద కథే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నాయకులు డీకే శివకుమార్ను టార్గెట్ చేసేందుకే ప్రవీణ్ను సీబీఐ డైరెక్టర్గా నియమించినట్లు వార్తలు షికారు చేస్తున్నాయి.
ఎందుకంటే.. కర్ణాటక డీజీపీగా ప్రవీణ్ ఉన్న సమయంలో ఆయనను డీకే శివకుమార్ ఇష్టమొచ్చినట్లు దూషించారు. బీజేపీ ఏజెంట్గా పని చేస్తున్నారని, పనికిరాని వాడు అని శివకుమార్ దూషించారు. అయితే శివకుమార్ సీబీఐ కేసు ఈ నెలాఖరులో విచారణకు రానుంది. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణలపై శివకుమార్పై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే కర్ణాటక ఎన్నికలు ముగిసే వరకు శివకుమార్ను విచారించొద్దని ప్రత్యేక కోర్టు సీబీఐ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. ఇక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో వచ్చే వారం ఈ కేసు విచారణకు రానుంది. సీబీఐ డైరెక్టర్గా నియామకమైన ప్రవీణ్ సూద్.. ఈ కేసులో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది.
2017లో బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్గా సేవలందిస్తున్న ప్రవీణ్ సూద్ను నాటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బదిలీ చేశారు. సీపీగా పని చేస్తున్న సమయంలో ఆయనపై అవినీతి ఆరోపణలు వెలువెత్తడంతో సీఎం సిద్ధరామయ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లోనే నాటి ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఇక జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసుతో పాటు బస్సులో ఓ మహిళా జర్నలిస్టును కొంత మంది వేధించిన కేసులో నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని సిద్ధరామయ్య పేర్కొన్నారు. బీజేపీకి వంతపాడుతున్నారని సిద్ధరామయ్య ఆరోపించారు. ఈ ఆరోపణలను ప్రవీణ్ సూద్ ఖండించారు. ప్రతీ కేసులోనూ దర్యాప్తు నిష్పక్షపాతంగా కొనసాగిస్తున్నానని ప్రవీణ్ తెలిపారు. తనకు రాజకీయ పార్టీలతో ఎలాంటి సంబంధం లేదని సూద్ స్పష్టం చేశారు. తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నట్లు పేర్కొన్నారు.
ఇక కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. కాంగ్రెస్ కార్యకర్తలను ప్రవీణ్ సూద్ లక్ష్యంగా చేసుకుని, హింసించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రవీణ్ సూద్ పనికిరాని వాడు అని శివకుమార్ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. బీజేపీ ఏజెంట్ అయినా ప్రవీణ్ సూద్పై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసలు పోలీసు జాబ్కు ప్రవీణ్ సరిపోడని డీకే వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై అకారణంగా 25 కేసులు నమోదు చేశారని, బీజేపీపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదని శివకుమార్ గుర్తు చేశారు.