Prasant Kishore | వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ప్రతికూల ఫలితాలు వచ్చినా 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని విపక్షాల కూటమి ఓడిస్తుందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు. అందుకు విపక్షాలకు చేయూతనిచ్చేందుకు సిద్దం అన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడం సాధ్యమేనా? అన్న ప్రశ్నకు అవుననే సమాధానమే వస్తుందన్నారు. కానీ ప్రస్తుత కూటములు, నేతల తీరుతో సాధ్యం కాదని చెప్పాల్సి వస్తుందని చెప్పారు. నూతన పార్టీ కంటే కొద్ది సర్దుబాట్లు అవసరం అని అన్నారు.
బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో సుమారు 200 లోక్సభ స్థానాల్లో బీజేపీ 50కి పైగా సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. మిగతా 350 స్థానాల్లో బీజేపీ స్వీప్ చేస్తుందని ఓ ఆంగ్ల టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ ఇతర పార్టీ, కూటములు తిరిగి పునరేకీకరణ కావాలి. తమ వనరులు, వ్యూహాలను మార్చుకుంటే ఈ 200 సీట్లలో 100 గెలుచుకుంటారు. అటుపై విపక్షాలకు లోక్సభలో 250-260 సీట్లు వస్తాయన్నారు ప్రశాంత్ కిశోర్
పశ్చిమ, ఉత్తర భారత రాష్ట్రాల్లో మరో 100 సీట్లలో బీజేపీని ఓడించడం సాధ్యమేనని ప్రశాంత్ కిశోర్ తెలిపారు. 2024 ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చే విపక్షాల కూటమికి మద్దతు ఇవ్వాలని తాను భావిస్తున్నా అని చెప్పారు. హిందుత్వ, జాతీయవాదం, సంక్షేమం నినాదాలతో బలీయమైన శక్తిగా బీజేపీ ఉందన్నారు. ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా మహా కూటమి ఏర్పాటు చేయడం కంటే విపక్షాలు మరింత సన్నిహితంగా కలిసి పోరాడాలన్నారు.
2015 బీహార్ ఎన్నికల్లో ఏకైక మహా కూటమి ఒక్కటే విజయం సాదించలేదు. నేతలు, పార్టీలు కలవడంతోనే సరిపోదు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రజల్లోకి ఒక పద్దతి ప్రకారం వెళ్లాలని ప్రశాంత్ కిశోర్ సూచించారు. దాదాపు 200 సీట్లలో బీజేపీ- కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని, గత రెండు లోక్సభ ఎన్నికల్లో 95 శాతానికి పైగా విజయం సాధించి సుమారు 190 సీట్లు గెలుచుకుందన్నారు.పశ్చిమ, ఉత్తర భారత్లో 100 స్థానాల్లో విజయం సాధ్యమే అని అన్నారు.
వచ్చే నెలలో మొదలయ్యే అసెంబ్లీ ఎన్నికలు 2024 లోక్సభ ఎన్నికలకు మార్గం చూపుతాయన్నారు. ఈ దఫా బీజేపీ గెలుపొందినా, 2024లో ఓడిపోక తప్పదన్నారు ప్రశాంత్ కిశోర్. 2012లో యూపీలో ఎస్పీ విజయం సాధించింది. ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. పంజాబ్లో అకాలీదళ్ పార్టీ అధికారంలో ఉంది. కానీ 2014 లోక్సభ ఎన్నికలు చాలా విభిన్నం అని వ్యాఖ్యానించారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకం అని ప్రశాంత్ కిశోర్ చెప్పారు. బీజేపీపై పోరు కోసం సామాజిక పునాది విస్తరణించడం ముఖ్యం అని చెప్పారు. యాదవేతర ఓబీసీలు, దళితుల్లో సంఘటితం, ఉన్నత కులాల్లో మరింత సంఘటితం పెరిగిందన్నారు. బీజేపీని ఢీకొట్టాలని ఏ పార్టీ లేదా ఏ నేత భావిస్తున్నా 5-10 ఏండ్ల వ్యూహం కావాలి. కేవలం ఐదు నెలల్లో జరిగేది కాదు. కానీ విజయం సాధిస్తాం. ఇదే ప్రజాస్వామ్యానికి ఉన్న గొప్పతనం అని వ్యాఖ్యానించారు.