Amartya Sen | రాజకీయ అవకాశవాదంతో దేశాన్ని విభజించినప్పుడు శక్తిమంతమైన వాణి వినిపించే వారు కావాలని నోబెల్ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత ఆర్థికవేత్త అమర్త్యసేన్ చెప్పారు. `అవకాశ వాద రాజకీయ శక్తులు దేశ ఐక్యతను ధ్వంసం చేసినప్పుడు, హిందూ ముస్లింలను విభజించినప్పుడు మనకు శక్తివంతమైన వాణి అవసరం` అని అన్నారు. ఆయన ఆనంద్ బజార్ దిన పత్రిక శత జయంతి ఉత్సవాల్లో వర్చువల్ ప్రసంగం చేస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు. 1922 మార్చిలో ఆనంద్ బజార్ బెంగాలీ పత్రిక ప్రారంభమైంది.
స్వాతంత్య్రానికి ముందు, తర్వాత భారత్లో పరిస్థితులను అమర్త్యసేన్ గుర్తు చేసుకున్నారు. `నాడు రాజకీయ కారణాల వల్ల దేశంలో చాలా మంది జైలు పాలయ్యారు. ఆనాడు నేను యువకుడ్ని. ఎటువంటి నేరం చేయకుండానే ప్రజలను జైలుకు ఎందుకు పంపేవారు అనే ప్రశ్న తరుచుగా ఉత్పన్నమయ్యేది` అని సేన్ చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా నేరం రుజువు కాకుండానే వ్యక్తులను జైల్లో పెట్టడం అలవాటుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
2020 ఢిల్లీ హింస కేసులో నిందితుడిగా ఉన్న మానవ హక్కుల కార్యకర్త ఉమర్ ఖాలీద్ అరెస్ట్ నేపథ్యంలో అమర్త్యసేన్ ఆరోపణలకు ప్రాధాన్యం ఏర్పడింది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా ఈశాన్య ఢిల్లీలో 2020 ఫిబ్రవరి 23-26 మధ్య జరిగిన ఘర్షణల కేసులో ఖాలీద్ నిందితుడిగా ఉన్నారు.
సాహసోపేతంగా ఆలోచించే కొందరు వ్యక్తులు రాజకీయ ధైర్య సాహసాలు ప్రదర్శించినందుకు ఎటువంటి కేసు విచారించకుండానే, నేరం రుజువు కాకుండానే ప్రభుత్వం చేతుల్లో బాధపడుతున్నారని అమర్త్యసేన్ ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయ సాధన దిశగా అడుగులు పడాలని అమర్త్యసేన్ పిలుపునిచ్చారు.