న్యూఢిల్లీ: ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా బీజేపీ తన ప్రచారంలో ఉపయోగించే పదబంధం ‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వం’. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది.. రాష్ట్రంలో కూడా బీజేపీని గెలిపిస్తే అభివృద్ధికి ఆటంకాలు ఉండవని ఏడేండ్లుగా ఆ పార్టీ ప్రచారం చేస్తూనే ఉన్నది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంటే అది జరుగుతుంది.. ఇది జరుగుతుంది.. అంటూ గాల్లో మేడలు చూపిస్తున్నది. ఓట్లను రాబట్టుకోవడం కోసం బీజేపీ ఎంచుకొన్న వ్యూహాల్లో ఇది ఒకటి. అయితే ఈ ప్రచారాన్ని ప్రజలు నిజమని నమ్ముతున్నారా? అన్నదానిపై లోక్నీతి-సీడీఎస్ సర్వే చేసింది. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ప్రజలు ఈ నినాదాన్ని కొద్దిగా నమ్మారని, అయితే రానురానూ ‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వం’ కాన్సెప్ట్ను పెద్దగా పట్టించుకోవడం లేదని సర్వేలో తేలింది. డబుల్ ఇంజిన్ పవర్ నినాదంతో అధికారంలోకి వచ్చిన రాష్ర్టాల్లో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోడం ఇందుకు కారణంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
ఈ ఎన్నికల్లోనూ అదే నినాదం
2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గలిచింది. అదే ఏడాదిలో ఆరు నెలల తర్వాత హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లోనే బీజేపీ మొదటిసారి ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం పదబంధాన్ని ప్రయోగించింది. తర్వాత అన్ని రాష్ర్టాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే నినాదాన్ని వినిపించింది. రాబోయే ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో గెలవడం కోసం కూడా మోదీ ఇదే నినాదం వినిపిస్తున్నారు. డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ అవసరాన్ని నొక్కిచెప్తున్నారు.
22 ఎన్నికలపై సర్వే
2014 లోక్సభ ఎన్నికల తర్వాత వేర్వేరు రాష్ర్టాల్లో 40 సార్లు అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికలు జరిగాయి. వీటిల్లో 22 ఎన్నికలపై లోక్నీతి-సీడీఎస్ సర్వే చేసింది. రాష్ర్టాల్లో అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో ఉన్న పార్టీనే రాష్ర్టాల్లో అధికారంలో ఉండాలా?(డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరమా?) అని సర్వేలో భాగంగా ప్రశ్నించింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక తొలుత అసెంబ్లీ ఎన్నికలు జరిగిన హర్యానాలో 45% మంది, మహారాష్ట్రలో 29% మంది, జార్ఖండ్లో 41% మంది దీనికి మద్దతిచ్చారు. ఈ మూడు రాష్ర్టాల్లో అప్పుడు బీజేపీనే అధికారంలోకి వచ్చింది. 2015లో ఢిల్లీ ప్రజలు ఈ వాదనను తిరస్కరించారు. ఇక్కడ ఆప్ గెలిచింది.
అస్సాంలో కూడా
2016లో అస్సాం, బెంగాల్, తమిళనాడు, కేరళలో ఎన్నికలు జరిగాయి. అస్సాంలో డబుల్ ఇంజిన్ వాదనకు 46% మంది మద్దతు లభించింది. బెంగాల్లో వ్యతిరేకించారు. కేరళ, తమిళనాడులో మద్దతు లభించినప్పటికీ ఓటింగ్ మాత్రం భిన్నంగా జరిగింది. ఇక్కడ బీజేపీ కాకుండా వేరే పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అయితే, ఇవే రాష్ర్టాల్లో గతేడాది ఎన్నికలు జరగ్గా.. డబుల్ ఇంజిన్ వాదనకు అప్పుడున్నంత మద్దతు లభించలేదు. కేరళలో 54% మంది డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కాన్సెప్ట్ను వ్యతిరేకించారు. తమిళనాడులో ఇది 40 శాతంగా ఉంది. బీజేపీ అధికారంలో ఉన్న అస్సాంలోనూ వ్యతిరేకత రావడం గమనార్హం.