ఇండ్లల్లోని కరెంట్ మీటర్లలో చూయించే ఒక్కో యూనిట్ను 1 కిలో వాట్ (వెయ్యి వాట్స్)గా పరిగణిస్తారు. ఒక గిగా వాట్.. 10 లక్షల కిలో వాట్స్కు సమానం. నెలకు 10 యూనిట్ల విద్యుత్తును ఒక కుటుంబం వినియోగిస్తుంది అనుకొంటే, ఒక గిగావాట్తో లక్ష కుటుంబాలకు నెలరోజులపాటు విద్యుత్తును అందించవచ్చు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: దప్పిక వేసినప్పుడు బావి తవ్విన చందంగా కేంద్రం వ్యవహరిస్తున్నది. థర్మల్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు అడుగంటుతున్నాయని, వేసవిలో విద్యుత్తు సంక్షోభానికి ఇది కారణంగా మారొచ్చని గత రెండునెలలుగా నిపుణులు కేంద్రాన్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ మోదీ సర్కారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. కొరత ఏమీలేదని బుకాయించింది. అయితే బొగ్గు కొరత కారణంగా కొద్దిరోజుల్లోనే థర్మల్ ప్లాంట్లలో విద్యుదుత్పత్తి నిలిచిపోవడంతో తాజాగా 16 రాష్ర్టాలను కరెంటు కష్టాలు చుట్టుముట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో మెట్రో, దవాఖానలకు విద్యుత్తు సరఫరా చేయలేని పరిస్థితి తలెత్తింది. దీంతో కేంద్రంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆలస్యంగా మేల్కొన్న కేంద్రం.. 42 ప్యాసింజర్ రైళ్లను నిరవధికంగా రద్దు చేసి.. బొగ్గు రవాణా చేసే రైళ్లకు మార్గం సుగమం చేస్తున్నట్టు ప్రకటించింది.
ఒక్కరోజుకు సరిపడా నిల్వలూ లేవు
దేశ రాజధాని ఢిల్లీలో బొగ్గు కొరత తీవ్రమైంది. ఇది ఇలాగే కొనసాగితే విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని.. మెట్రోలు, ప్రభుత్వ దవాఖానలు, ఇతర ప్రధాన సంస్థలకు కూడా విద్యుత్తు సరఫరా నిలిచిపోతుందని ఢిల్లీ సర్కారు కేంద్రాన్ని హెచ్చరించింది. వెంటనే రాజధానిలోని విద్యుత్తు ప్లాంట్లకు బొగ్గు సరఫరా పెంచాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఢిల్లీ విద్యుత్తు మంత్రి సత్యేందర్ జైన్ కేంద్రప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రధాన థర్మల్ ప్లాంట్లలో ఒకరోజుకు సరిపడా కూడా బొగ్గు నిల్వలు లేవన్నారు. మరోవైపు, విద్యుత్తు కోతలతో విసుగు చెందిన పంజాబ్ రైతులు ఆ రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి హర్భజన్ సింగ్ ఇంటి ఎదుట ధర్నాకు దిగారు.
ఆలస్యంగా మేల్కొన్నారు.. రైళ్లు రద్దు చేశారు
శుక్రవారం మధ్యాహ్నం 2.50గంటలకు దేశంలో విద్యుత్తు డిమాండ్ 207.111 గిగా వాట్స్. ఇప్పటివరకూ ఇదే రికార్డు.
విమర్శల నేపథ్యంలో విద్యుదుత్పత్తి కేంద్రాలకు బొగ్గు సరఫరా చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. బొగ్గు రవాణా చేసే రైళ్ల రాకపోకలకు ఆటంకం కలుగకుండా 42 ప్యాసింజర్ రైళ్లను నిరవధికంగా రద్దు చేసింది. బొగ్గు కొరత తీరేవరకూ వచ్చే నెలరోజుల్లో 650కి పైగా ప్రయాణికుల రైళ్ల రాకపోకలను రద్దు చేసేందుకు రైల్వేశాఖ నిర్ణయించినట్టు సమాచారం. అయితే, బొగ్గు అంశంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టకుండా రైళ్లను రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు.
సంక్షోభానికి కారణాలు అనేకం..
దేశంలో 70 శాతం విద్యుదుత్పత్తి బొగ్గు ద్వారానే జరుగుతున్నది. వర్షాల కారణంగా గత అక్టోబర్లో ప్రధాన బొగ్గు క్షేత్రాల్లోకి వరద నీరు వచ్చిచేరడంతో వెలికితీత ప్రక్రియకు అంతరాయం కలిగింది. ఆనాడే దేశంలోని ప్రధాన థర్మల్ ప్లాంట్లు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. దీనికితోడు విదేశాల నుంచి వచ్చే బొగ్గు దిగుమతులను కేంద్రం 50 శాతం తగ్గించింది. ఈ క్రమంలోనే వేసవి వచ్చింది. ఈ ఏప్రిల్లో 38 ఏండ్ల గరిష్ఠస్థాయికి విద్యుత్తు డిమాండ్ చేరింది. దీంతో డిమాండ్కు సరపడా విద్యుత్తును అధికారులు సరఫరా చేయలేకపోతున్నారు. విద్యుదుత్పత్తి కోసం థర్మల్ ప్లాంట్లు సాధారణంగా 26 రోజులకు సరిపడా బొగ్గును నిల్వ చేసుకొంటాయి. ప్రస్తుతం ప్లాంట్లలో సగటున 2 రోజులకు సరిపడా మాత్రమే బొగ్గు నిల్వలు ఉన్నాయి. దీంతో మెజారిటీ ప్లాంట్లలో విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. ఫలితంగా 16 రాష్ర్టాల్లో విద్యుత్తు కోతలు మొదలయ్యాయి. బొగ్గు సంక్షోభానికి వ్యాగన్ల కొరత కూడా కారణమే. బొగ్గు రవాణాకు కనీసం 465 రైల్వే కోల్ రేక్స్ అవసరం. అయితే, కేంద్రం 410 రైల్వే కోల్ రేక్స్ మాత్రమే వినియోగిస్తున్నది.
బుల్డోజర్లు ఆఫ్.. ప్లాంట్లు ఆన్
విద్వేష బుల్డోజర్లను నిలిపేసి, పవర్ ప్లాంట్లను స్టార్ట్ చేయాలని మోదీ సర్కారుకు ఏప్రిల్ 20న సూచించా. మళ్లీ చెప్తున్నా.. విద్యుత్తు కోతలు చిన్న పరిశ్రమలతో పాటు దవాఖానల్లోని రోగుల ప్రాణాలకూ ప్రమాదమే. దేశం, ప్రజల గురించి ప్రధాని మోదీకి పట్టదా?
-కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ
కలిసి పరిష్కారాన్ని వెదకాలి
దేశంలో విద్యుత్తు కొరత తీవ్రంగా ఉన్నది. అయితే, ఢిల్లీలో ఇప్పటివరకూ ఎలాగోలా సర్దుబాట్లు చేశాం. అయితే ఇకపై కుదరకపోవచ్చు. దేశంలో అన్ని ప్రాంతాల్లో పరిస్థితి దాదాపుగా ఇలాగే ఉన్నది. సమస్య పరిష్కారానికి సత్వర ఉపాయాన్ని అందరం కలిసి అన్వేషించాలి.
-ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
ఇది జాతీయ సంక్షోభం
రాష్ర్టాలకు బొగ్గు సరఫరా చేసే బాధ్యత కేంద్రానిదే. అయితే, బొగ్గు సంక్షోభం కారణంగా 16 రాష్ర్టాల్లో విద్యుత్తు కొరత నెలకొన్నది. ఇది జాతీయ సంక్షోభమే. అవసరం లేనప్పుడు విద్యుత్తు సాధనాలను నిలిపేయండి. విద్యుత్తు కొరతకు కేంద్రమే కారణం.
-రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్