చెన్నై : తమిళనాడులోని కూనూర్ వద్ద హెలికాఫ్టర్ కుప్పకూలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ విమానంలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన భార్యతో పాటు 14 మంది ప్రయాణిస్తున్నారు. ఇప్పటివరకూ 11 మృతదేహాలు లభించగా బిపిన్ రావత్ ఆయన భార్య క్షేమసమాచారంపై ఆందోళన నెలకొంది. ఆర్మీ హెలికాఫ్టర్ బుధవారం సులూర్ నుంచి వెల్లింగ్టన్కు వెళుతుండగా కూనూర్ వద్ద కుప్పకూలింది.
సీడీఎస్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి లోనవడంతో వాయుసేన ఉన్నతాధికారులు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్ధితులు, కారణాలపై హాట్ డిబేట్ సాగుతోంది. విమానం చెట్లను ఢీకొట్టి మంటలు వ్యాపించగా తాను చూశానని ప్రత్యక్ష సాక్షి చెప్పుకొచ్చారు. హెలికాఫ్టర్ పూర్తిగా దగ్ధమైన దృశ్యాలు కనిపించాయి.
హెలికాఫ్టర్ ప్రమాదానికి ప్రతికూల వాతావరణం కారణమా లేక విమానం కరెంట్ తీగలను తాకిందా లేక మెకానికల్ లోటుపాట్లు తలెత్తాయా, ఇంజన్ వైఫల్యమా, పైలట్ హెలికాఫ్టర్ను సరిగ్గా కంట్రోల్ చేయలేకపోయారా వంటి అనేక ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. అసలు హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైన సమయంలో ఎంత ఎత్తులో ఎగురుతుందనే వివరాలూ వెల్లడికావలసి ఉంది. మరోవైపు ఘటనా స్ధలాన్ని సందర్శించేందుకు ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి సుపూర్ ఎయిర్బేస్కు వెళ్లారు. రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ కూడా ఘటనా స్ధలానికి చేరుకోనున్నారు.