న్యూఢిల్లీ, జూలై 26: ‘కరోనా వైరస్ సోకినప్పటికీ తల్లులు తమ శిశువులకు చనుబాలు ఇవ్వవచ్చు. మిగతా సమయాల్లో మాత్రం శిశువులను వారి నుంచి 6 అడుగుల దూరంలో ఉంచాలి’ అని ఢిల్లీ లేడీ హార్డింగె వైద్య కళాశాల ప్రసూతి విభాగం అధిపతి మంజు పూరీ తెలిపారు. పాలు ఇచ్చే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని తల్లులకు సూచించారు. పాలు ఇచ్చేప్పుడు ఫేస్ షీల్డ్, మాస్క్ ధరించాలని తెలిపారు. శిశువును చూసుకోవడానికి కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడం వల్ల భౌతిక దూరం పాటించడం కుదరకపోతే కరోనా తగ్గే వరకు మాస్క్ ధరించాలని తల్లులకు సూచించారు. తల్లి నుంచి గర్భస్థ శిశువుకు కరోనా సోకుతుందని చెప్పడానికి ఆధారాలు లేవన్నారు. గర్భిణులు కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.