న్యూఢిల్లీ, జనవరి 3: 2020-21లో జరగాల్సి ఉండి కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన జనగణన కార్యక్రమం ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించడం లేదు. థర్డ్వేవ్ భయాందోళనల నేపథ్యంలో.. జనగణన, ఎన్పీఆర్ అప్డేట్ ఎప్పుడు చేపట్టాలన్న దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోం శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది జూన్ వరకు జిల్లా, సివిల్, పోలీస్ యూనిట్ల సరిహద్దులు మార్చొద్దని కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలను ఆదేశించింది. సాధారణంగా జనగణన ప్రారంభమయ్యే మూడు నెలల ముందు సరిహద్దులు మార్చడంపై నిషేధం విధిస్తారు. జూన్ వరకు సరిహద్దులను మార్చడంపై కేంద్రం నిషేధం విధించిన నేపథ్యంలో అక్టోబర్ వరకు జనగణన ప్రారంభమయ్యే అవకాశాలు లేవని అధికారులు పేర్కొన్నారు.