న్యూఢిల్లీ: ప్రముఖ లిక్కర్ వ్యాపారి పాంటీ చద్దా కుటుంబానికి చెందిన ఫామ్హౌజ్ను ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డీడీఏ) కూల్చివేసింది. సుమారుగా రూ.400 కోట్ల విలువైన ఈ కట్టడం ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించారన్న కారణంతో కూల్చివేశారు.
‘ఇక్కడి ఛత్రపూర్ ప్రాంతంలోని 10 ఎకరాల్లో ఈ ఫామ్హౌజ్ విస్తరించి ఉంది. దీంట్లో గార్డెన్, ఔట్హౌస్, ప్రధాన భవనం ఉన్నాయి. ప్రధాన భవనం కూల్చేవేయటాన్ని డీడీఏ అధికారులు శనివారం పూర్తిచేశారు. అక్రమ కట్టడాల్ని కూల్చేశాక, ఆ భూమిని స్వాధీనం చేసుకున్నాం’ అని డీడీఏ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ చర్యలపై చద్దాకు చెందిన వేవ్ గ్రూప్ స్పందించలేదు.