హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) భాగంగా తొలి సంగ్రామానికి తెరలేచింది. ఛత్తీస్గఢ్ (Chhattisgarh), మీజోరంలో (Mizoram) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఛత్తీస్గఢ్లోని మొత్తం 90 స్థానాలకుగాను తొలి విడుతలో భాగంగా నేడు 20 సీట్లలో, మిజోరంలోని మొత్తం 40 నియోజకవర్గాలకు ఒకే విడుతగా పోలింగ్ నిర్వహిస్తున్నారు.
ఛత్తీస్గఢ్ మొదటి విడుతలోని 20 స్థానాల్లో 12 నియోజకవర్గాలు నక్సల్స్ ప్రభావిత బస్తర్ రీజియన్లో ఉన్నాయి. వాటిలో 10 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మిగిలిన స్థానాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు కొనసాగుతుంది. దాదాపు 40 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోన్నారు. మొత్తం 223 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ 20 స్థానాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ 17 సీట్లను కైవసం చేసుకుంది. కాగా, రెండో విడుతలో 70 స్థానాలకు ఈ నెల 17న పోలింగ్ జరుగనుంది.
బస్తర్ ప్రాంతంలో ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మావోయిస్టులన పిలుపు నేపథ్యంలో బస్తర్ డివిజన్లో ఉన్న దంతెవాడ, బీజాపూర్, కొంటా, అంతగఢ్, భానుప్రతాపూర్, కంకేర్, కేష్కల్, కొండగావ్, మొహ్లా-మన్పూర్, నారాయణపూర్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 వరకు, ఖైరాగఢ్, డొంగార్గఢ్, రాజ్నంద్గావ్, డోంగార్గావ్, ఖుజ్జి, పండారియా, కవర్ధా, బస్తర్, జగదల్పూర్, చిత్రకోట్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగుతుంది.
ఇక మిజోరంలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. మొత్తం 40 అసెంబ్లీ స్థానాల్లో 174 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 8.57 లక్షల మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరికోసం ఎన్నికల సంఘం 1,276 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసింది. వీటిలో 30 పోలింగ్ కేంద్రాలు అంతఃరాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దులో ఉండటంతో భారీగా బలగాలను మోహరించారు. రెండు రాష్ట్రాల్లోనూ డిసెంబర్ 3న ఫలితాలు వెలువడుతాయి.