కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహర్ జిల్లాకు రాజకీయ నేతల రాకను ఎన్నికల కమిషన్ నిషేధించింది. నాలుగో విడుత పోలింగ్ నేపథ్యంలో శనివారం సితాల్కుచి నియోజకవర్గంలో సీఐఎస్ఎఫ్ జవాన్లు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించారు. దీంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో ఈ జిల్లాకు మూడు రోజుల పాటు రాజకీయ నేతలెవరూ రావద్దని ఈసీ ఆదేశించింది. కాల్పులు జరిగిన ప్రాంతాన్ని ఆదివారం సందర్శిస్తానని, దీనికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతానని సీఎం మమత ప్రకటించిన నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
మరోవైపు సీఐఎస్ఎఫ్ కాల్పులను ఈసీ సమర్థిస్తూ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం.. మానిక్ అనే బాలుడు 126 పోలింగ్ బూత్ పరిసరాల్లో అనారోగ్యంతో ఉండగా, ముగ్గురు మహిళలు అతడి బాగోగులు చూస్తున్నారు. గమనించిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది బాలుడి ఆరోగ్యం గురించి అడిగారు. సమీపంలో ఉన్న పోలీస్ వాహనంలో ఆసుపత్రికి తరలించాలని స్థానికులకు సూచించారు. అయితే సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆ బాలుడ్ని కొట్టినట్లు కొందరు స్థానికులు అపార్థం చేసుకున్నారు. దీంతో పెద్దగా ఏడుస్తూ, కేకలు వేస్తూ సుమారు 350 మంది పురుషులు, మహిళలు ఇండ్లలోని వస్తువులతో పోలింగ్ బూత్ సమీపం వద్ద గుమిగూడి అక్కడి సీఐఎస్ఎఫ్పై దాడి చేశారు. పోలింగ్ సిబ్బందిపైనా దాడి చేయబోయారు. దీంతో కొందరు సీఐఎస్ఎఫ్ సిబ్బందితోపాటు ఒక హోంగార్డు గాయపడ్డారు.
ఇంతలో పోలింగ్ బూత్కు సమీపంలో ఉన్న క్విక్ రెస్పాన్స్ టీం అక్కడికి చేరుకుంది. ఆ వాహనంపైనా స్థానికులు దాడి చేయడంతో తమ ప్రాణ రక్షణ కోసం సీఐఎస్ఎఫ్ సిబ్బంది తొలుత గాల్లోకి కాల్పులు జరిపారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో తమ ప్రాణాలతోపాటు పోలింగ్ సిబ్బంది ప్రాణ రక్షణ, ఈవీఎంలను కాపాడేందుకు మరోదారి లేక కాల్పులు జరిపినట్లు ఈసీ తెలిపింది. ఈ ఘటనలో బులెట్ గాయాలతో నలుగురు మరణించగా పలువురు గాయపడినట్లు వెల్లడించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఐదో దశ ఎన్నికల సైలెంట్ సమయాన్ని 72 గంటలకు పొడిగించింది. దీంతో అభ్యర్థులు ఒక రోజు ముందుగా తమ ప్రచారాన్ని ముగించాల్సి ఉంటుంది.