న్యూఢిల్లీ, నవంబర్ 18: రాజకీయ పార్టీలు ఎన్నికల గుర్తులను తమ ఆస్తిగా భావించరాదని ఢిల్లీ హైకోర్టు పేర్కొన్నది. పార్టీ పనితీరు నాసిరకంగా తయారైతే గుర్తును కోల్పోవాల్సి రావచ్చని నొక్కిచెప్పింది. సమతాపార్టీ తమకు చెందిన కాగడా గుర్తును శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కాగడా గుర్తు తమదని, దాని మీద ఎన్నోసార్లు పోటీ చేశామని సమతాపార్టీ తన పిటిషన్లో తెలిపింది. ఏకసభ్య ధర్మాసనం ఈ కేటాయింపును సమర్థించగా.. దానిని సవాల్ చేస్తూ సమతాపార్టీ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్పై శనివారం చీఫ్ జస్టిస్ సతీశ్చంద్ర, జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పార్టీ పనితీరు తీసికట్టుగా తయారైతే గుర్తును వాడుకొనే హక్కు పోతుందని 1968 ఎన్నికల గుర్తుల (రిజర్వేషన్, కేటాయింపు) ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయని తెలిపింది.