రాయ్గఢ్: మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దాంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రాయ్గఢ్ జిల్లాలో వరుణుడి ప్రభావం మరింత తీవ్రంగా ఉన్నది. జిల్లాలోని రాసయాని పోలీస్స్టేషన్ పూర్తిగా నీట మునిగింది. ఎడతెరపి లేని వర్షాలవల్ల లోతట్టు ప్రాంతాలకు భారీగా వరదనీరు చేరింది. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్ కూడా నీట మునిగింది.
పోలీస్స్టేషన్ పరిసరాలతోపాటు గదుల్లోకి కూడా వరదనీరు వెళ్లింది. దాంతో పోలీస్ సిబ్బంది మోకాళ్ల లోతు వరద నీటిలోనే లోపలికి బయటికి నడవాల్సి వస్తున్నది. దీనిపై రాయ్గఢ్ జిల్లా ఎస్సీ సోమ్నాథ్ ఘర్గే మాట్లాడుతూ.. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలవల్ల రాసయాని పోలీస్స్టేషన్లోకి వరద నీరు చేరిందన్నారు. అంతేగాక నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న ఆప్టా గ్రామం కూడా పూర్తిగా నీట మునిగిందని చెప్పారు.
ఇదిలావుంటే ఇవాళ కూడా ముంబై, థానే, పాల్ఘర్, రాయ్గఢ్, రత్నగిరి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రాయ్గఢ్ జిల్లా కలెక్టర్ యోగేశ్.. ఆ జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.