Police sisters : బీహార్ రాష్ట్రం ఛప్రా జిల్లాలోని ఎక్మా గ్రామంలో ఒకే జిల్లాకు చెందని ఏడుగురు అక్కాచెల్లెళ్లు పోలీస్ ఉద్యోగాలు సంపాదించారు. బీహార్ పోలీస్, అబ్కారీ శాఖలతోపాటు కేంద్ర సాయుధ బలగాల్లో వారు ఉద్యోగాలు దక్కించుకున్నారు. దాంతో అందరూ ఆడపిల్లలనే కన్నారంటూ సమాజం నుంచి అవహేళనలు, అవమానాలు ఎదుర్కొన్న తల్లిదండ్రులు గర్వపడేలా చేశారు. అంతేగాక అక్కాచెల్లెళ్లంతా కలిసి ఇప్పుడు తమ తల్లిదండ్రులకు నాలుగు అంతస్తుల భవంతిని కట్టించి ఇచ్చారు. ఈ పోలీస్ సిస్టర్స్ విజయగాథ గురించి వివరంగా తెలుసుకుందాం…
సరాన్ జిల్లా మాంఝీ పోలీస్ స్టేషన్ పరిధిలో నచాప్ గ్రామానికి చెందిన కమల్ సింగ్, శారదా దేవి దంపతులు. వీరికి ఏడుగురు బిడ్డలు, ఒక కొడుకు. ఒక్క కొడుకు ఉంటే బాగుంటుందన్న ఆశతో వాళ్లు పిల్లలను కనుకుంటూ వెళ్లారు. ఏడుగురు ఆడపిల్లల తర్వాత కొడుకు జన్మించడంతో వారి కోరిక నెరవేరింది. అయితే 8 మంది పిల్లలను పోషణ కష్టమై కమల్సింగ్ దంపతులు ఇబ్బందులు పడుతుంటే.. గ్రామస్తులు నవ్వుకునేవారు. ఏడుగురు ఆడ పిల్లల పెళ్లిళ్లు ఎలా చేస్తావని హేళన చేసేవారు. గ్రామస్తుల సూటిపోటి మాటలు భరించలేక కమల్సింగ్ దంపతులు స్వగ్రామాన్ని విడిచిపెట్టారు.
తమ ఏడుగురు బిడ్డలు, కొడుకును తీసుకుని ఛప్రా జిల్లాలోని ఎక్మా గ్రామానికి వలసవచ్చారు. అక్కడ ఒక పిండి గిర్నీ ఏర్పాటు చేసుకుని బతుకుబండి లాగించడం మొదలుపెట్టారు. వారికి పిల్లలు కూడా చేదోడువాదోడుగా ఉండేవారు. అలా పిల్లలు పెరిగి పెద్దవాళ్లయ్యి ప్రయోజకులుగా మారారు. అక్కాచెల్లెళ్లు ఏడుగురూ పోలీస్ ఉద్యోగా సంపాదించారు. వారిలో కొందరు బీహార్ పోలీస్ శాఖలో, మరికొందరు ఎక్సైజ్ శాఖలో, మిగిలిన వారు వివిధ కేంద్ర బలగాల్లో ఉద్యోగులుగా ఉన్నారు.
ఆ ఏడుగురు అక్కాచెల్లెళ్లే ఒకరికొకరు మార్గదర్శకులుగా మారి రాణించారు. ఇప్పుడు తమ బిడ్డలను చూసి కమల్ సింగ్ దంపతులు గర్వపడుతున్నారు. తాను ఆడబిడ్డలు భారమని ఏనాడు భావించలేదని అన్నారు. వారిని పెంచి పెద్దచేస్తే వాళ్ల బతుకు వాళ్లే బతుకుతారు అనే ధైర్యంతోనే ఉండేవాడినని చెప్పారు. కానీ ఇప్పుడు అందరూ ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించి నేను అనుకున్నదాని కంటే గొప్పగా బతుకుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్య విషయం ఏంటంటే.. తల్లిదండ్రులు, చిన్న వాడైన తమ్ముడి మీద ప్రేమతో ఆ ఏడుగురు అక్కాచెల్లెళ్లు నాలుగంతస్తుల భవనం కట్టించారు.