కేసీఆర్ సారు పుణ్యమే..
నాకు 75 ఏండ్లుంటయి. పదిహేనేండ్లున్నప్పటి సంది చేపలు వడుతున్న. మా అయ్యతో కలిసి చెర్లు, కుంటలు, వాగులు, ఒర్రెలు, మడుగులల్ల వట్టిన. వలలు కొనెతందుకు పైసల్లేక కూలికి పోయిన. అప్పటి సర్కారు నయా పైసా ఇయ్యలె. చెర్లల్ల చేప పిల్లలు పొయ్యలె. బెస్తోళ్లందరం కలిసి సొసైటీ ఏర్పాటు చేసుకున్నం. కైకలూరు నుంచి చేప పిల్లలు కొనుక్కొచ్చి చెర్లల్ల పోసినం. కనీ, ఇప్పుడు తెలంగాణ సర్కారు మా బతుకుదెరువును మంచిగజేసె. ఏటా చెర్లల్ల చేప పిల్లలు పోయవట్టె. సబ్సిడీ కింద మాకు వలలు, మోటర్ సైకిండ్లు ఇయ్యవట్టె. అప్పుడు సైకిండ్ల మీద తిరుగుడే కష్టమైతుండె. ఇప్పుడు బండిమీద పది కిలోమీటర్లు పోయి చాపలు పడ్తున్నం. ఎక్కడ పడితే అక్కడ అమ్ముకుంటున్నం. అమ్మిన చాపల్లో లాభమంతా మాకే వస్తంది. మధ్యమానేరే మాకు ఆధారమైంది. ఇదంతా కేసీఆర్ సారు పుణ్యమే. జీవితాంతం రుణపడి ఉంటం.
సంక్షేమ పథకాలతో వృత్తులకు పునర్జీవం పోస్తున్న కేసీఆర్ సర్కారు మత్స్యకారుల అభ్యున్నతికి పెద్దపీట వేసింది. సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని అమలు చేసి విరివిగా నిధులు మంజూరు చేస్తూ వారి బతుకుల్లో వెలుగులు నింపుతున్నది. అందులో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లాకు 12 కోట్లు కేటాయించింది. ఉచితంగా చేప విత్తనాలు పంపిణీ చేస్తున్నది. 75 శాతం సబ్సిడీపై వాహనాలు, వలలు అందిస్తున్నది. చెరువులు, కుంటలపై మత్స్యకారులకే హక్కులు కల్పించి దళారీ వ్యవస్థకు చరమగీతం పాడింది.
-రాజన్న సిరిసిల్ల మార్చి 16 (నమస్తే తెలంగాణ)
ఒకప్పుడు వాగులు, కుంటలు, ఒర్రెలే సర్వస్వమని భావించిన గంగపుత్రులకు నేడు మధ్యమానేరే జీవనాధారమైంది. చేపలు విక్రయించేందుకు రాష్ట్ర సర్కారు ప్రత్యేక మార్కెట్లు ఏర్పాటు చేసింది. విడిగా ఉన్న కార్మికులతో కలిసి కొత్త సంఘాలను ఏర్పాటు చేసి, ఉపాధి అవకాశాలు మెరుగు పరిచింది. రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా మొత్తం 89 సంఘాలుండగా, 5,538 మంది సభ్యులున్నారు. వీరిలో 1,481 మందికి సబ్సిడీ కింద జిల్లా మత్స్య శాఖ వివిధ పరికరాలను పంపిణీ చేసింది. 50వేలకు పైగా విలువైన ద్విచక్ర వాహనాలు 12,500కే ఇచ్చింది. 1,062 మంది లబ్ధిదారులకు టీవీఎస్ చాంప్ మోపెడ్లను పంపిణీ చేసింది. ప్లాస్టిక్ క్రేట్లు 451, వలలు 209, లాగుడు వలలు 1, లగేజీ ఆటోలు 55, బొలేరో వాహనాలు 11, హైజెనిక్ ట్రాన్స్పోర్ట్ వాహనం 1, ఒక మహిళా సహకార సంఘానికి 3.60లక్షలు రుణాలు, 360 చెరువులు, ఎగువ మానేరు, దిగువ మానేరు జలాశయాల్లో కోటీ 15లక్షల 61వేల చేప విత్తనాలు వేశారు. 13,128 క్వింటాళ్ల చేపల దిగుబడితో మత్స్య కార్మికులకు ఉపాధి లభించింది. గతేడాది 3,070 మందికి రిజర్వాయర్లలో చేపలు పట్టేందుకు లైసెన్సులు ఇవ్వగా, ఈ యేడాది ఇప్పటి వరకు 870 మంది రెన్యువల్ చేసుకున్నారు. లైసెన్సులు తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ద్విచక్ర వాహనాలతో మత్స్య కార్మికులు కిలోమీటర్ల దూరం వెళ్లి చేపలు పట్టుకుంటున్నారు. పట్టిన చేపలను వాహనాలపై పెట్టుకుని అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. మధ్యమానేరు జలాశయంలోకి గోదావరి జలాలు రావడం, రకరకాల చేపలతో మత్స్య కార్మికులకు మెరుగైన ఉపాధి లభించింది.
సబ్సిడీ కింద వలలు ఇచ్చిన్రు..
తెలంగాణ సర్కారు వచ్చినంకనే మా గంగ పుత్రులకు మేలు జరుగుతున్నది. సబ్సిడీ కింద వలలు, బండ్లు, ట్రేలు ఇచ్చిన్రు. మధ్యమానేరు మాకు బువ్వ పెడుతున్నది. అందులోని చేపలతో వందలాది కుటుంబాలు బతుకుతున్నయ్. బండ్ల మీద చింతలఠాణా, చీర్లవంచకు పోయి పట్టుకొస్తున్నం. పెద్ద పెద్ద చాపలు, రకరకాలై వస్తున్నయి. ఎన్నడూ చూడని శాపలు మానేరులో కనిపిస్తున్నయ్. మాకు ఉపాధి చూపి ఆదుకున్న కేసీఆర్, కేటీఆర్ సార్లకు రుణపడి ఉంటం.గడప రమేశ్, సొసైటీ కార్యదర్శి
సర్కారు సాయం ఎన్నటికీ మరువం..
చేపలు పట్టుకుని బతుకుతున్న మాపై ఏప్రభుత్వాలు కనికరం చూపలేదు. మేమే సొంతంగా విత్తన చేపలు కొనుక్కొచ్చి చెరువుల్లో వేసుకున్నం. అవి సరిపోక వేరే జిల్లాల నుంచి కొనుక్కొచ్చి అమ్ముకున్నం. వచ్చిన లాభంలో సగం దళారీలకే పెట్టినం. ముఖ్యమంత్రి కేసీఆర్ దయవల్ల అన్ని చెర్లల్లో ఉచితంగా చేపలేసిన్రు. మధ్యమానేరులో చేపలు పట్టుకోవడం వల్ల వచ్చిన లాభం మాకే మిగులుతున్నది.
-వంగల బాలరాజు, సొసైటీ సభ్యుడు