చెన్నై : శ్రీలంకలో నివసించే తమిళుల కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని పీఎంకే వ్యవస్ధాపకులు ఎస్ రాందాస్ విజ్ఞప్తి చేశారు. శ్రీలంకలో ప్రత్యేక తమిళ రాష్ట్రం ఏర్పాటుకు చొరవ తీసుకుని అవసరమైన న్యాయపరమైన చర్యలు చేపట్టాలని ఆయన కేంద్రాన్ని కోరారు.
ప్రపంచవ్యాప్తంగా తమిళుల్లో ఈ అంశంపై రెఫరెండం నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఐక్యరాజ్యసమితిని ఒప్పించాలని అన్నారు. శ్రీలంకలో తమిళుల కోసం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు దిశగా కేంద్రం చొరవ చూపాలని కోరారు. లంకలో తమిళుల కోసం ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఎప్పటినుంచో వినిపిస్తోందని చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా తమిళుల కల సాకారం చేసే దిశగా కేంద్రం చర్యలు చేపట్టాలని కోరారు.
శ్రీలంక తమిళుల కోసం స్వతంత్ర రాష్ట్ర ఏర్పాటుపై భారత్ తన వైఖరి వెల్లడించాలని అన్నారు. శ్రీలంకలో డ్రాగన్ ఉనికి పెరుగుతున్న క్రమంలో అక్కడ తమిళుల కోసం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మన దేశ భద్రతను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. శ్రీలంకలో తమిళులు ఎదుర్కొంటున్న సమస్యలకు వారి కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడమే ఏకైనక పరిష్కారమని రాందాస్ స్పష్టం చేశారు.