ఓట్ల కోసం ఇచ్చే ఉచిత హామీలు దేశాభివృద్ధికి అత్యంత ప్రమాదకరం. ఈ ఉచితాల పట్ల ప్రజలు, ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలి.
జూలై 17న బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ రహదారి ప్రారంభోత్సవంలో ప్రధాని
(స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ)
ఉచితాలు దేశాభివృద్ధికి ప్రమాదకరమంటూ వ్యాఖ్యానించిన ప్రధాని మోదీ ఇప్పుడు కిక్కురుమనకుండా ఉండిపోయారు. కారణం.. తాను ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకం పొడిగింపుపై ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఆయనది. ఉచితాలు వద్దంటూ సుద్దులు వల్లించిన తానే.. ఉచిత బియ్యం, గోధుమల పథకాన్ని పొడిగిస్తే ప్రతిపక్షాలు తూర్పారబట్టడం ఖాయమని సంశయపడుతున్నారు. అందుకే, ఈ నెల 30తో స్కీమ్ గడువు ముగియబోతున్నప్పటికీ, పథకం పొడిగింపుపై ఇంకా ఎలాంటి ప్రకటనా చేయట్లేదు. అయితే, త్వరలో జరుగనున్న గుజరాత్, హిమాచల్ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల్లో లబ్ధి పొందాలంటే పథకాన్ని పొడిగించడం అనివార్యమని సీనియర్ నేతలు ఆయనకు సూచించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో ప్రధాని నిర్ణయంపై ఉత్కంఠ నెలకొన్నది.
కరోనా లాక్డౌన్లో బీజేపీ సర్కారు పీఎంజీకేఏవై పథకాన్ని తీసుకొచ్చింది. ఏడాదికి రూ.1.5 లక్షల కోట్ల నిధుల్ని వెచ్చిస్తూ.. ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా అందిస్తూ స్కీమ్ను ఇంతవరకూ నెట్టుకొచ్చింది. ఈ నెల 30తో పథకం గడువు ముగియనున్నది. అయితే, ఈ పథకాన్ని పొడిగించాలా? వద్దా? అనే దానిపై కేంద్రం నిర్ణయం తీసుకోలేకపోతున్నది. దీనికి రాజకీయ కారణాలతో పాటు మరో కారణం కూడా ఉన్నది. పథకానికి కావాల్సిన ధాన్యం నిల్వలు ఎఫ్సీఐ వద్ద ప్రస్తుతానికి సరిపడినంతగా లేవు. గోధుమలు, బియ్యంతో కలిపి ఎఫ్సీఐ వద్ద సెప్టెంబర్ 1 నాటికి 4.92 కోట్ల టన్నుల ఆహార నిల్వలు ఉన్నప్పటికీ, అక్టోబర్ 1 నాటికి ఇది 3.2 కోట్ల టన్నులకు పడిపోవచ్చని అంచనా. ఈ లెక్కన.. పీఎంజీకేఏవై పథకాన్ని మరో ఆరు నెలలు పొడిగించాలంటే 2.38 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు అవసరం అవుతాయి. అంటే అక్టోబర్ 1 నాటికి ఎఫ్సీఐ దగ్గర ఉండనున్న మొత్తం 3.2 కోట్ల టన్నుల ధాన్యంలో 2.38 కోట్ల టన్నుల ధాన్యాన్ని పక్కకు పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు ఎఫ్సీఐ వద్ద 82 లక్షల టన్నుల ధాన్యం నిల్వలు మాత్రమే ఉంటాయి. అయితే, నిబంధనల ప్రకారం ఎఫ్సీఐ ఎప్పుడూ కనీసం 3.7 కోట్ల టన్నుల ధాన్యాన్ని నిల్వ చేయాల్సి ఉంటుంది.
పథకం కొనసాగింపుపై నిర్ణయం తీసుకోవటం ప్రధానికి విషమ పరీక్ష లాంటిదే. ఖజానాపై భారాన్ని పరిగణనలోకి తీసుకొంటూనే, ఉచిత హామీలపై తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించే విధంగా ఆయన నిర్ణయం ఉండాలి. ఓట్లకు సంబంధించి కూడా యోచించాల్సిన పరిస్థితి.
– ఆరతి జెరాత్, విశ్లేషకులు
యూపీ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు పీఎంజీకేఏవై స్కీమ్ సాయపడింది. ఇప్పుడు ఈ పథకాన్ని మోదీ సర్కారు నిలిపేస్తే రానున్న ఎన్నికల్లో ఆ పార్టీపై ప్రభావం పడొచ్చు.
-ప్రొ. సంజయ్ కుమార్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలప్మెంట్ సొసైటీస్
ఇప్పటికే ఎఫ్సీఐ వద్ద ధాన్యం నిల్వలు సరిపడినంతగా లేవు. స్కీమ్ను కొనసాగిస్తే వచ్చే ఏడాది ఆహార సంక్షోభం తలెత్తవచ్చు.
-ప్రసన్న అనంతసుబ్రహ్మణ్యం,
ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్