గూడూరు: గత రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జలపాతాల్లో వరదనీటి ప్రవాహం పెరుగుతోంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని కొమ్ములవంచ అటవీ ప్రాంతంలోని భీముని జలపాతం జాలువారుతున్నది. గురువారం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి అటవీ ప్రాంతంలో కొండలు, గుట్టల మధ్య నీటి ఉధృతి పెరుగడంతో జలకళ సంతరించుకున్నది. పచ్చని అటవీ ప్రాంతంలో సహజసిద్ధంగా ఉన్న ఈ జలపాతం అందాలు, పక్షుల కిలకిలరావాలతో కనులవిందు చేస్తున్నాయి.
కొవిడ్ నిబంధనల కారణంగా భీముని జలపాతం వద్దకు పర్యాటకులకు అనుమతి లేదని సీఐ రాజిరెడ్డి, తహసీల్దార్ శైలజ తెలిపారు. గురువారం జలపాతం వద్దకు కొంతమంది పర్యాటకులకు వెళ్లగా అధికారులు వెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. నిబంధనలు సడలించే వరకు జలపాత సందర్శనకు పర్యాటకులు రావద్దని సూచించారు.