PM Modi : క్షణికమైన ఆనందాన్నిచ్చే మత్తు పదార్థాలు (Drugs) ఉజ్వల భవిత (Brite future) ను దెబ్బతీసి వ్యక్తిగత జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తాయని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) హెచ్చరించారు. మాదకద్రవ్య రహిత సమాజం కోసం ప్రతినబూనాలని యువతకు పిలుపునిచ్చారు. ఎలాంటి మత్తు పదార్థాలకైనా బానిసలు కాకుండా దూరంగా ఉండేలా మానసిక, శారీరక దృఢత్వాన్ని కలిగి ఉండాలన్నారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అవగాహన కల్పించాలని కంటెంట్ క్రియేటర్లు, యూట్యూబర్లకు సూచించారు.
ఇవాళ మన్ కీ బాత్ 137వ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ మేరకు యువతకు దిశానిర్దేశం చేశారు. ‘మాదకద్రవ్య రహిత భారత్’ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి వ్యక్తి, కుటుంబం, సమాజం, దేశం యావత్తూ కలిసి రావాలని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వ్యసనం నుంచి విముక్తులైన వారిని సమాజం అక్కున చేర్చుకుని గౌరవించాలన్నారు. సమాజ మద్దతు, యోగ, ధ్యానం, దృఢచిత్తం, ఆత్మవిశ్వాసం ద్వారా మత్తు పదార్థాలకు దూరం కావచ్చన్నారు. ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత భారత్ సంకల్ప్ అభియాన్’ కార్యక్రమంలో యువత పెద్ద మొత్తంలో హాజరవుతున్నారని పేర్కొన్నారు.
వీధి వ్యాపారుల కోసం తీసుకువచ్చిన ‘పీఎం స్వనిధి యోజన’ లక్షలాది మంది మహిళలకు ఉపయోగపడుతోందని మోదీ పేర్కొన్నారు. దీని ద్వారా దాదాపు 46 శాతం మంది మహిళలు తమ వ్యాపారాలను విస్తరించుకుంటూ.. ఆదాయాన్ని పెంచుకుంటున్న అంశాన్ని గుర్తుచేశారు.