న్యూఢిల్లీ: డొమినికాలో కోర్టు విచారణ జరుగుతున్న వరకు మెహుల్ చోక్సీని భారత్కు తిప్పి పంపడం సాధ్యం కాదని ఆయన తరపు న్యాయవాది విజయ్ అగర్వాల్ చెప్పారు. డొమినికాలో తమ మూలాలను వెల్లడించాక తమకు మరోమారు బెయిల్ పిటిషన్ దాఖలు చేసే స్వేచ్ఛ ఉందని శనివారం తెలిపారు.
పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు మెహుల్ చోక్సీకి డొమినికా హైకోర్టు శుక్రవారం బెయిల్ నిరాకరించిన సంగతి తెలిసిందే. మెహుల్ చోక్సీకి డొమినికాతో ఎటువంటి సంబంధాలు లేవని పేర్కొంది.
అదే సమయంలో ఆయనపై విచారణ ప్రారంభం కాలేదని కూడా జడ్జి వ్యానాంటే అడ్రైన్ రాబర్ట్స్ పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత బెయిల్ నిరాకరిస్తున్నట్లు చెప్పారు. బెయిల్ పిటిషన్లో ఎటువంటి పూచీకత్తును చోక్సీ సమర్పించలేదని గుర్తు చేశారు.
వైద్య కారణాల రీత్యా తన క్లయింట్కు బెయిల్ ఇవ్వాలని మెహుల్ చోక్సీ లాయర్ వాదించారు. అయితే, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణంలో నిందితుడిగా మెహుల్ చోక్సీ 2018 నుంచి పరారీలో ఉన్నాడు.
భారత్ కూడా అతడ్ని వెనక్కు రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. గత నెల 23వ తేదీన అంటిగ్వా నుంచి పరారైన మెహుల్ చోక్సీకి తక్షణం భారత్కు అప్పగించే విషయమై స్వల్ప ఊరట లభించినట్లే కనిపిస్తున్నది.
మెహుల్ చోక్సీ భారతీయ పౌరుడు అని డొమినికా ప్రధాని రోజ్వెల్ట్ స్కెరిట్ ఇటీవల వ్యాఖ్యానించారు. పరారీలో ఉన్న నేరగాడిపై ఆ దేశంలోకి కోర్టులే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. తమ కోర్టులో విచారణ పూర్తయ్యే వరకు చోక్సీ హక్కులను తమ ప్రభుత్వం కాపాడుతుందన్నారు.