న్యూఢిల్లీ: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతికి ప్రధాని నరేంద్రమోదీ సంతాపం తెలియజేశారు. సినీ ప్రపంచానికి అతను ఒక తేజస్సు అని కొనియాడారు. ఈ మేరకు ప్రధాని సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేశారు. చంద్రమోహన్ మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆ ప్రకటనలో వెల్లడించారు.
చంద్రమోహన్ నటనా వైభవం, అద్వితీయమైన జనాకర్షణ శక్తి కొన్ని తరాలపాటు సినీ ప్రేక్షకులను ఉల్లాసపరుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆయన మరణం సినీ లోకాన్ని శూన్యంలోకి నెట్టేసిందని, చంద్రమోహన్ లేని లోటును పూడ్చటం చాలా కష్టమని రాసుకొచ్చారు. చంద్రమోహన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చివరగా ‘ఓం శాంతి’ అంటూ తన సందేశాన్ని ముగించారు.
కాగా, గత కొన్నాళ్లుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న నటుడు చంద్రమోహన్ పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయనను జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగానే ఉదయం తుదిశ్వాస విడిచారు. సోమవారం చంద్రమోహన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన మేనల్లుడు వెల్లడించారు.