న్యూఢిల్లీ: మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ (PM Modi) తొలి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇటలీలో జరుగనున్న జీ7 సదస్సులో మోదీ పాల్గొంటారు. ఈ నెల 13 నుంచి 15 వరకు ఇటలీలోని అపూలియో వేదికగా ఈ సమావేశం జరుగుతున్నది. ఉక్రెయిన్ యుద్ధంతోపాటు ఇజ్రాయెల్ దాడులతో శిథిలమవుతున్న గాజా స్ట్రిప్ను ఆదుకునేందుకు, యుద్ధాలను ఆపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్, జపాన్ ప్రధాని ఫునియో కిషిదా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో, ఇటలీ ప్రధాని జార్జియా మెలానీ తదితరులు హాజరుకానున్నారు.
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ అయ్యే అవకాశం ఉన్నది. ఇదే విషయమై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు (NSA) జాక్ సల్లివన్ మాట్లాడుతూ.. బైడెన్ ప్రధాని మోదీని కలవాలని భావిస్తున్నారని చెప్పారు. అయితే ఈ భేటీకి షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదన్నారు. ఇరువురు నేతలు కలుసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.