వారణాసి : కాశీ విశ్వనాథ ఆలయంలో పారిశుద్ధ్య కార్మికులపై పూల వర్షం కురిపించారు. ప్రతి ఒక్క కార్మికుడిపై పూలు చల్లేందుకు ఆ ప్రాంగణమంతా మోదీ కలియతిరిగారు. ఈ సందర్భంగా కొంతమంది కార్మికులను మోదీ ఆప్యాయంగా పలుకరించి, ముచ్చటించారు. కార్మికులపై పూలు చల్లిన అనంతరం అందరితో కలిసి మోదీ ఫోటో దిగారు. దీంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. మోదీ పూలు చల్లిన సమయంలో పారిశుద్ధ్య కార్మికులు హర హర మహదేవ అని నినదించారు.
ఈ కార్యక్రమం కంటే ముందు కాశీ విశ్వనాథుడికి ప్రధాని మోదీ ఇవాళ జలాభిషేకం చేశారు. గంగా నదిలో పుణ్య స్నానం చేసి.. ఆ నది జలంతో విశ్వనాథుడి వద్దకు వెళ్లి అభిషేకం చేశారు. ఈ సందర్భంలో ఆలయ పూజారులు శాస్త్రోక్తంగా రుద్రాభిషేకం నిర్వహించారు. గంగా నది నుంచి నీటితో ఆలయానికి వెళ్తున్న సమయంలో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. నది నుంచి కొంత దూరం వరకు కారులో వెళ్లి ఆ తర్వాత ఆయన నడుచుకూంటూ స్వామివారి సన్నిధికి వెళ్లారు. ఇక ఆలయ పరిసరాల్లో డమరుక స్వాగతం ఆకట్టుకున్నది.