PM Modi Condoles | ప్రముఖ చలనచిత్ర దర్శకుడు భారతీరాజా మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారతీయ సినిమా రంగంలో, ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమలో ఆయన ఒక దిగ్గజమని, తన అద్భుతమైన సృజనాత్మకతతో తమిళ సినిమా గమనాన్నే మార్చేశారని ప్రధాని కొనియాడారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో సంతాప సందేశాన్ని పంచుకున్నారు. భారతీరాజా గ్రామీణ జీవనాన్ని, పల్లెటూరి వాతావరణాన్ని వెండితెరపై ఆవిష్కరించిన తీరు అద్భుతమని, అది ఎప్పటికీ ప్రశంసనీయంగా నిలిచిపోతుందని మోదీ పేర్కొన్నారు. ఈ కష్టసమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఓం శాంతి అంటూ ప్రధాని నివాళులర్పించారు.
మరోవైపు భారతీరాజా అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన తేనిలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు పూర్తి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 1977లో వచ్చిన క్లాసిక్ హిట్ ’16 వయతినిలే’ సినిమాతో దర్శకుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన భారతీరాజా.. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సాగిన సినీ ప్రస్థానంలో 40కి పైగా చిత్రాలను తెరకెక్కించారు. తమిళ చిత్రసీమలో ఆయన అందించిన విశేష సేవలకు గానూ ‘ఇయక్కునర్ ఇమయం’ (దర్శక శిఖరం) అనే బిరుదును దక్కించుకున్నారు.