అర్పిత (32) గృహిణి. సెంట్రల్ ఢిల్లీలోని కిర్బీ స్లమ్ ఏరియాలో నివాసముంటారు. రోజూ వేకువజామునే నాలుగింటికి చెంబులో నీళ్లతో దగ్గరిలోని అటవీ ప్రాంతానికి బయల్దేరుతారు. ఆమె ఇంట్లో మరుగుదొడ్డి లేకపోవడమే దీనికి కారణం. ఒక్క అర్పిత మాత్రమే కాదు.. ఆ ప్రాంతంలోని దాదాపు 3 వేల మంది దుస్థితి ఇదే. ప్రధాని నరేంద్రమోదీ అధికారిక నివాసానికి కూతవేటు దూరంలోని ఈ ప్రాంతంలో బహిరంగ మల మూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్) పథకం అమలు తీరిది.
హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ- స్పెషల్ టాస్క్ బ్యూరో): దేశంలోని గ్రామాలు, పట్టణాలన్నీ బహిరంగ మల మూత్ర విసర్జన రహిత ప్రాంతాలుగా మారాయని 2019 అక్టోబర్ 2న కేంద్రప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. అయితే, ఇది పూర్తిగా అవాస్తవమని ఇంగ్లిష్ న్యూస్ వెబ్సైట్ ‘న్యూస్ లాండ్రీ’ క్షేత్రస్థాయి పర్యటనలో తేలింది. కిర్బీ స్లమ్ ఏరియా ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డ్ పరిధి కిందకు వస్తుంది. ఈ కంటోన్మెంట్ పరిధిలోని ప్రాంతాలన్నీ ఓడీఎఫ్ కిందకు వచ్చినట్టు ‘స్వచ్ఛభారత్ అభియాన్’ ప్రకటించింది. వాస్తవాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి.
కిర్బీ స్లమ్ ఏరియాలోని వెయ్యికి పైగా ఇండ్లల్లో మరుగుదొడ్ల సదుపాయమే లేదు. టాయ్లెట్లను కట్టుకోవడానికి స్థానికులు ముందుకొచ్చినప్పటికీ, కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టవద్దంటూ బోర్డు అధికారులు అడ్డు చెప్పారు. నిధుల విడుదలకు కేంద్రప్రభుత్వం కొర్రీలు పెట్టింది. దీంతో ప్రజలు నిరసనబాట పట్టారు. ఆలస్యంగా మేల్కొన్న కంటోన్మెంట్ బోర్డు మొక్కుబడిగా మొబైల్ టాయ్లెట్లను ఏర్పాటు చేసింది. అయితే, నిర్వహణ లేమి, టాయ్లెట్ గదులకు డోర్లు, లోపల వాటర్ ట్యాప్లు లేకపోవడంతో మహిళలు వాటిని వినియోగించడానికి ఇబ్బంది పడుతున్నారు. మొబైల్ టాయ్లెట్ల నిర్వహణకు ఓ ప్రైవేట్ కంపెనీకి బోర్డు నెలకు రూ.2 లక్షలు చెల్లిస్తున్నప్పటికీ, వాటి నిర్వహణ అధ్వాన్నంగా ఉన్నదని స్థానికులు మండిపడుతున్నారు. అటు మొబైల్ టాయ్లెట్లు వినియోగించుకోలేక, మరుగుదొడ్లు కట్టుకోవడానికి డబ్బులు లేక.. పేదలు మల, మూత్ర విసర్జనకు అడవిబాట పడుతున్నారు.
మొబైల్ టాయ్లెట్లు అపరిశుభ్రంగా ఉంటాయి. ఎవరూ క్లీన్ చేయరు. లోపలికి వెళ్లడానికి మెట్లు, డోర్లు కూడా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో వాటిని ఎలా వాడగలం. అందుకే అడవిలోకి వెళ్తాం.
-సుమన్, గృహిణి
మాతో పాటు పురుషులు కూడా అడవిలోకే వస్తారు. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అందుకే చలికాలమైనప్పటికీ, వేకువజామునే పురుషులు రాకముందే మహిళలందరం వేగంగా కాలకృత్యాలు తీర్చుకోవాల్సి వస్తున్నది.
-పార్వతి, గృహిణి