న్యూఢిల్లీ: ఫిబ్రవరిలో అయోధ్యను సందర్శించవద్దని కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ (PM Modi) సూచించారు. రామ మందిరానికి వెళ్లి ప్రోట్రోకాల్, వీఐపీ సందర్శన పేరుతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించవద్దని కోరారు. మార్చి నెలలో అయోధ్యకు వెళ్లాలని సూచించారు. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కేంద్ర మంత్రులతో ప్రధాని మోదీ అన్నారు. అలాగే అయోధ్యలోని రామ మందిరంలో సోమవారం జరిగిన ప్రాణప్రతిష్ట కార్యక్రమం, ప్రజల స్పందన గురించి కేబినెట్ మంత్రులను ఆయన ఆరా తీశారు.
కాగా, అయోధ్య రామ మందిరం సోమవారం ప్రారంభమైంది. ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. అనంతరం రామ మందిరానికి భక్తుల తాకిడి పెరిగింది. మంగళవారం, బుధవారం సుమారు మూడు లక్షల మందికిపైగా భక్తులు బాల రాముడ్ని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ బాగా పెరుగడంతో అయోధ్యకు బస్సు సర్వీసులను కూడా నిలిపివేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలో భక్తుల రద్దీ గురించి ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.