PM Cares fund | పీఎం కేర్స్ ఫండ్పై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సరికొత్త వాదనను తెరపైకి తెచ్చింది. పీఎం కేర్స్ ఫండ్కు అందిన విరాళాలను వెల్లడించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తూ వస్తున్నది. విరాళాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదంటూ ఇన్నాళ్లూ చెప్తూ వచ్చిన బీజేపీ సర్కార్.. ఇవాళ మాట మార్చింది. పీఎం కేర్స్ ఫండ్ ప్రభుత్వానికి కాదు.. ఇది రాజ్యాంగం పరిధిలోకి రాదు.. అంటూ తమ అఫిడవిట్లో పేర్కొన్నది. పీఎం కేర్స్ ఫండ్ భారత రాజ్యాంగం, పార్లమెంట్ లేదా ఏ రాష్ట్ర చట్టం ప్రకారం సృష్టించలేదని మంగళవారం ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తెలిపింది. అందువల్ల దీనిని పబ్లిక్ అథారిటీ అని పిలవలేమన్నది. అలాగే ఇండిపెండెంట్ పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్టులు భారత రాజ్యాంగం పరిధిలోకి రావని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఏ ట్రస్ట్ అయినా ప్రభుత్వం లేదా ఏదైనా ప్రభుత్వ సంస్థ ద్వారా సృష్టించబడదు లేదా నిధులు సమకూర్చదు అని కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నది. అందువల్ల దానిపై ఎటువంటి నియంత్రణను కలిగి ఉండదని తెలిపారు. గత జూలైలో కేంద్రం దాఖలు చేసిన ఒక పేజీ సమాధానంపై ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్తో కూడిన ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి ఇవాళ అఫిడవిట్ దాఖలు చేసింది.
పీఎం కేర్స్ ట్రస్టీల బోర్డులో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కేటీ థామస్, మాజీ డిప్యూటీ స్పీకర్ కరియా ముండాతో పాటు కేంద్ర హోం మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి ఉన్నారు. పీఎం కేర్స్ ఫండ్ అనేది ఒక పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్ అని, ఇది స్వచ్ఛంద విరాళాలను మాత్రమే స్వీకరిస్తుందని అఫిడవిట్లో తెలిపింది. ఇది ఎంత మాత్రమూ కేంద్ర ప్రభుత్వ వ్యాపారం కాదని, పీఎం కేర్స్ ఫండ్కు ప్రభుత్వం నుంచి నిధులు పొందదని పేర్కొన్నారు. ఈ ట్రస్ట్ నిధి భారత ప్రభుత్వానిది కాదని, అలాగే ఇందులోని మొత్తం భారత్ కన్సాలిడేటెడ్ ఫండ్కు వెళ్లదని ఇంతకుముందు ప్రధానమంత్రి కార్యాలయం తన అఫిడవిట్లో స్పష్టం చేసింది.