నోయిడా: ఇరుగుపొరుగు మధ్య ఒక్కోసారి చిన్నచిన్న విషయాలకే పెద్ద గొడవలు జరుగుతుంటాయి. ఒక్కోసారి కొట్టుకుని పోలీస్స్టేషన్లకు వెళ్లే పరిస్థితి కూడా వస్తుంది. తాజాగా అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గౌతమ్ బుద్ధనగర్లోని సదోపూర్ గ్రామంలో రెండు ఇరుగుపొరుగు కుటుంబాల మధ్య వివాదం ఉన్నది. వాడీ మాన్విర్ అనే వ్యక్తికి, అతని పక్కింట్లో ఉండే రవీందర్, సౌరభ్ అనే వ్యక్తులకు మధ్య గతంలో చిన్న గొడవ జరిగింది.
ఈ క్రమంలో రవీందర్, సౌరభ్లకు చెందిన పిట్ బుల్ జాతి పెంపుడు కుక్క వాడీ మాన్విర్ కుమారుడిపై (మైనర్ బాలుడు) దాడి చేసింది. కుక్క దాడితో బాలుడు కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి ఆ కుక్కను వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. వాళ్లు ఎంతోసేపు వెంటపడితే తప్ప ఆ కుక్క బాలుడిని విడిచిపెట్టలేదు. అయితే, ఆ సమయంలో అక్కడే ఉన్న కుక్క యజమానులు మాత్రం దాన్ని వెనక్కి పిలిచే ప్రయత్నం చేయలేదు.
దాంతో వాడీ మాన్విర్ తన కుమారుడిని ఆస్పత్రిలో చేర్పించి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. కుక్క యజమానులైన రవీందర్, సౌరభ్లను అరెస్ట్ చేశారు. నిందితుల కుటుంబంలోని మరో వ్యక్తి జగత్ పరారీలో ఉన్నాడు. దాంతో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.