న్యూఢిల్లీ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ప్రయాణించిన ఆర్మీ హెలీకాప్టర్ కూలడానికి మేఘావృతమైన వాతావరణంలో పైలట్ పొరపాటు కారణమని భారతవాయు సేన (ఐఏఎఫ్) నేతృత్వంలోని త్రివిధ దళాల దర్యాప్తు కమిటీ నిర్ధారించింది. గత ఏడాది డిసెంబర్ 8న తమిళనాడులో కూలిన సైనిక హెలికాప్టర్లో జనరల్ రావత్, ఆయన భార్యతోపాటు 12 మంది ఇతర సిబ్బంది మరణించారు.
ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన త్రివిధ దళాల దర్యాప్తు కమిటీ ప్రాథమిక నివేదికను శుక్రవారం విడుదల చేసింది. ‘లోయలోని వాతావరణ పరిస్థితుల్లో ఊహించని మార్పు కారణంగా మేఘాలలోకి హెలికాప్టర్ ప్రవేశించడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. పైలట్ అయోమయానికి ఇది దారి తీసింది. దీని ఫలితంగా ఆ ప్రాంతంలో నియంత్రిత ఫ్లైట్ (సీఎఫ్ఐటీ) జరిగింది’ అని త్రివిధ దళాల దర్యాప్తు కమిటీ పేర్కొంది. ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ విశ్లేషణతోపాటు సాక్షులను ప్రశ్నించిన తర్వాత ఆర్మీ హెలీకాప్టర్ ప్రమాదానికి దారి తీసిన కారణాలను గుర్తించినట్లు వెల్లడించింది.
విమానం లేదా హెలీకాప్టర్ పైలట్ పూర్తి నియంత్రణలో ఉన్నప్పుడు అనుకోకుండా భూభాగం, నీరు లేదా అడ్డంకిలోకి అది వచ్చినప్పుడు సీఎఫ్ఐటీ సంభవిస్తుందని దర్యాప్తు కమిటీ వివరించింది. అయితే ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం లేదని స్పష్టం చేసింది. యాంత్రిక వైఫల్యం, విధ్వంసం లేదా నిర్లక్ష్యం ప్రమాదానికి కారణం కాదని తమ దర్యాప్తులో తేలినట్లు ఐఏఎఫ్ పేర్కొంది.
ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) ప్రకారం, భూభాగం, నీరు లేదా మరొక అడ్డంకిని విమానం ఎదుర్కొన్నప్పుడు నియంత్రణ కోల్పోయే సూచన లేకుండా సంభవించే ప్రమాదాలను సీఎఫ్ఐటీగా పేర్కొంటారు. పైలట్ పూర్తి నియంత్రణలో ఉన్నప్పుడు వారు గుర్తించేలోపు ఇది జరుగుతుందని వైమానిక రంగ సంస్థలు పేర్కొన్నాయి. ఆ ప్రాంతం, ప్రాదేశిక వాతావరణ పరిస్థితులపై పైలట్లకు అవగాహన లేకపోవడం, దిక్కుతోచని స్థితి వల్ల సీఎఫ్ఐటీ ప్రమాదాలకు దారి తీస్తుందని గతంలోని నివేదికలు స్పష్టం చేశాయి.