ముంబై: ఒక పావురం ఎనిమిది నెలలుగా పోలీస్ కస్టడీలో ఉన్నది. గూఢచర్యం ఆరోపణలపై దర్యాప్తు చేసిన పోలీసులు ఎట్టకేలకు దానిని విడిచిపెట్టారు. (Pigeon Probed) ఆ పావురానికి స్వేచ్ఛ లభించడంతో ఎగిరిపోయింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. ముంబై పోర్టు వద్ద ఒక పావురం రెక్కలపై చైనా భాషలో రాసిన సందేశాలు ఉన్నాయి. ఆ పావురం ద్వారా చైనా గూఢచర్యం చేస్తున్నట్లు అనుమానించిన పోలీసులు దానిని పట్టుకున్నారు. ఆ పక్షిపై గూఢచర్యం కింద కేసు నమోదు చేశారు. గత ఎనిమిది నెలలుగా వెటర్నరీ హాస్పిటల్ వద్ద పంజరంలో ఆ పావురాన్ని ఉంచి తాళం వేశారు. ఆ పక్షి గూఢచర్యానికి పాల్పడిందా అన్న దానిపై దర్యాప్తు చేశారు.
మరోవైపు పోలీసులు అకారణంగా పావురాన్ని ఎనిమిది నెలలుగా పంజరంలో బంధించడంపై పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు, గూఢచర్యం అభియోగాన్ని వెనక్కి తీసుకున్నారు. అలాగే ఆ పక్షిని విడిచిపెట్టేందుకు వెటర్నరీ హాస్పిటల్ సిబ్బందికి అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో పెటా కార్యకర్తల సమక్షంలో హాస్పిటల్ సిబ్బంది ఆ పావురాన్ని విడిచిపెట్టడంతో అది గాల్లోకి ఎగిరిపోయింది. ఆ పావురం ఆరోగ్యంగానే ఉందని పెటా కార్యకర్తలు తెలిపారు.