న్యూఢిల్లీ : టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా ఆవిర్భవించడం సంతోషకరమైన విషయమని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి పేర్కొన్నారు. బీఆర్ఎస్ దేశ వ్యాప్తమై.. కేసీఆర్ ప్రధాని కావాలని ఆయన ఆకాంక్షించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ మాదిగలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. మాదిగల ధర్నాకు పిడమర్తి రవి మద్దతు తెలిపి, మాట్లాడారు.
టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారడం చారిత్రక అవసరమని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ చాలా విజన్ ఉన్న నాయకుడని, ఆయన ప్రధాని అయ్యి దేశంలో సమూల మార్పులకు నాంది పలుకుతారని పేర్కొన్నారు. అనాదిగా పరిష్కారానికి నోచుకోని మాదిగల అస్తిత్వ పోరాటానికి, కేసీఆర్ పార్లమెంట్ సాక్షిగా ముగింపు పలుకుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అట్టడుగు వర్గాల బాధలు తెలిసిన నేత కేసీఆర్ ప్రధాని కావడం ఖాయమని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో విసిగి వేసారిన జనం ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీల వైపు చూస్తున్న తరుణంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారి దేశ ప్రజలను ఆకర్షిస్తోందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. పేదల బాధలు తెలిసిన కేసీఆర్ మాదిగల పక్షాన నిలబడే మొదటి జాతీయ నేత అవుతారని ఆశిస్తున్నట్టు తెలిపారు.
కోలాట బృందంతో ధర్నా చౌక్కు చేరుకున్న మాదిగ ఐకాస నాయకులు ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే బిల్లు పెట్టి చట్టం తేవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో దళితసంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు బూదాల బాబూరావు, మాదిగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కొడారి ధీరన్, మాదిగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బొల్లికొండ వీరేందర్, ఎంహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మైసా ఉపేందర్, దళిత దండు రాష్ట్ర అధ్యక్షుడు మోగిలయ్య, మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గద్దల నాగేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండమీది గోవిందరావు, కురుపాటి సుదర్శన్, మెడపట్ల దుబ్బయ్య, బోరెల్లి సురేష్, తదితరులు పాల్గొన్నారు.