బెంగళూరు: బజరంగ్ దళ్ శిబిరంలో కార్యకర్తలకు ఆయుధ శిక్షణ ఇస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొన్ని రాజకీయ పార్టీలు విమర్శలు చేయడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. అయితే ఆత్మరక్షణ కోసం ఈ మేరకు శిక్షణ ఇస్తున్నట్లు బజరంగ్ దళ్ పేర్కొంది. కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఈ ఘటన జరిగింది. పొన్నంపేటలోని సాయిశంకర్ విద్యాసంస్థలో ఈ నెల 5 నుంచి 11 వరకు శౌర్య పరీక్షా శిబిరాన్ని బజరంగ్ దళ్ నిర్వహించింది. సుమారు 400 మంది కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. వారికి ఎయిర్ పిస్టల్స్, త్రిశూలాలతో ఆయుధ శిక్షణ ఇచ్చిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా, బజరంగ్ దళ్ ఆయుధ శిక్షణపై విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొడగు జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలతో సహా పలువురిపై ఆరోపణలు చేసింది. కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేసింది. ఏఐసీసీ ఇంచార్జీ, ఎమ్మెల్యే దినేశ్ గుండు రావు ఒక ట్వీట్ చేశారు. బజరంగ్ దళ్ కార్యకర్తలకు ఎందుకు ఆయుధ శిక్షణ ఇస్తున్నారు? ఎలాంటి లైసెన్స్ లేకుండా ఆయుధ శిక్షణ ఇవ్వడం నేరం కాదా? బీజేపీ నేతలు దీనిని బహిరంగంగా ఎందుకు సమర్థిస్తున్నారు? అని ప్రశ్నించారు. అలాగే మతం పేరుతో హింసకు పాల్పడేలా శిక్షణ ఇస్తూ యువత జీవితాలను బజరంగ్ దళ్ నాశనం చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ ఆరోపించారు.
మరోవైపు ఈ విమర్శలు, ఆరోపణలపై బజరంగ్ దళ్ స్పందించింది. కేవలం ఆత్మరక్షణ కోసమే తమ కార్యకర్తలకు ఈ మేరకు శిక్షణ ఇచ్చినట్లు బజరంగ్ దళ్ నేత రఘు సకలేష్పూర్ తెలిపారు. శిక్షణకు వినియోగించిన ఎయిర్ పిస్టళ్లు, త్రిశూలాలు ఆయుధ చట్టం ఉల్లంఘటన కిందకు రావని చెప్పారు. బరువులు ఎత్తడం, లాంగ్ జంప్, మంకీ రోప్ వంటి వాటిల్లో కూడా కార్యకర్తలకు శిక్షణ ఇచ్చినట్లు వివరించారు. ప్రకృతి విపత్తుల్లో సహాయ కార్యక్రమాల కోసం తమ కార్యకర్తలకు సాధారణంగా ఈ మేరకు శిక్షణ ఇస్తుంటామని వెల్లడించారు.